సెప్టెంబ‌రులో త‌ప్ప‌నిస‌రిగా పూర్తిచేయాల్సిన ప‌నులు ఇవే..

ఐటీఆర్ ఫైల్లింగ్ మొద‌లుకుని ఆధార్‌-పాన్ లింకింగ్ వ‌ర‌కు ఈ ఐదు ప‌నుల‌ను సెప్టెంబ‌రు నెల‌లో త‌ప్ప‌కుండా పూర్తిచేయాలి. 

Updated : 17 Aug 2022 11:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిత్యజీవితంలో ఆర్థిక విషయాలకు సంబంధించి కొన్ని పనులను గడువులోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఐదు నెలల్లో ఎన్నో గడువులు పూర్తయిపోయాయి. మరి సెప్టెంబర్‌ నెలకు గానూ పూర్తి చేయాల్సిన పనులేమిటో ఇప్పుడు చూద్దాం...

ఐటీఆర్ ఫైలింగ్‌..: 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారులు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు (ఐటీఆర్‌) దాఖ‌లు చేసేందుకు సెప్టెంబ‌రు 30 వరకు గడువు ఉంది. సాధారణంగా ప్ర‌తి సంవ‌త్స‌రం జులై 31లోపు రిట‌ర్నుల దాఖలు పూర్తిచేయాలి. అయితే ప్ర‌స్తుతం కొవిడ్-19 కార‌ణంగా ప‌న్ను చెల్లింపుదారులు ఎదుర్కుంటున్న ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబ‌రు 30 వ‌ర‌కు గ‌డువు పెంచారు. అందువ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు ఐటీఆర్ దాఖ‌లు చేయ‌క‌పోతే ఈ నెల 30లోపు ఆ ప్ర‌క్రియ పూర్తి చేయాలి. లేదంటే రూ.5వేల ఆల‌స్య రుసుముతో ప‌న్ను దాఖ‌లు చేయాల్సి వ‌స్తుంది. అయితే, ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆదాయం రూ.5ల‌క్ష‌ల‌కు మించకపోతే ఆల‌స్య రుసుము రూ.1000కి మించదు.

ఆటో డెబిట్ లావాదేవీలు: బ్యాంక్ ఖాతా నుంచి చేసే ఆటో డెబిట్ చెల్లింపుల‌కు వ‌చ్చే నెల ప్రారంభం నుంచి అంటే అక్టోబ‌రు 1 నుంచి టు-ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్ అవ‌స‌రం. ఇందుకోసం బ్యాంక్ రికార్డుల్లో మొబైల్ నంబర్‌ అప్‌డేట్ చేయ‌డం చాలా ముఖ్యం. సాధార‌ణంగా మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌ల‌కు ఇచ్చే ఆటో-డెబిట్ ఆదేశాల‌కు త‌ప్ప‌నిస‌రి అవుతుంది. పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులు, రుణాల చెల్లింపులతో పాటు ఇత‌ర సేవ‌ల‌కు సంబంధించి నెల‌వారీ చేసే లావాదేవీల్లో  ఆటో-డెబిట్ ఆప్ష‌న్‌ను వినియోగిస్తారు. ఆటో-డెబిట్‌ చేసే ఐదు రోజుల ముందుగానీ లేదా క‌నీసం 24 గంట‌లు ముందుగానీ బ్యాంక్ వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్ పంపాలి. ఓటీపీ వెరిఫికేష‌న్ పూర్తైతేనే ఆటో డెబిట్ పూర్త‌వుతుంది. దేశంలో డిజిటల్ చెల్లింపులను సురక్షితం చేసేందుకు అదనపు ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ)ను రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) త‌ప్ప‌నిస‌రి చేసింది. ఏప్రిల్ 1 నుంచే ఈ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని భావించిన‌ప్ప‌టికీ వినియోగ‌దారుల సౌక‌ర్యార్థం సెప్టెంబ‌రు 30 వ‌ర‌కు పాత ప‌ద్ధ‌తిలోనే ఆటో డెబిట్ చెల్లింపులు చేసేందుకు అనుమ‌తించింది.

డీమ్యాట్‌-ఖాతా కేవైసీ: డ్యీమాట్‌, ట్రేడింగ్ ఖాతాలు ఉన్న‌ పెట్టుబడిదారులు సెప్టెంబర్ 30 లోపు కేవైసీ (నో-యుర్‌-క‌స్ట‌మ‌ర్‌) పూర్తిచేయాలి. లేదంటే ఖాతాలు డీ-యాక్టివేట్ అయ్యే అవ‌కాశం ఉంది. 

ఆధార్‌-పాన్ లింక్ గ‌డువు: ఆధార్‌-పాన్ కార్డును అనుసంధానించేందుకు సెప్టెంబ‌రు 30 వరకు గడువు ఉంది. ఈ గడువు ముగిసిన త‌ర్వాత ఆధార్‌తో అనుసంధానించ‌ని పాన్ కార్డులు ప‌నిచేయ‌వు. బ్యాంక్ ఖాతా తెర‌వ‌డంతో పాటు ఇత‌ర ఆర్థిక లావాదేవీల నిర్వహణ‌కు పాన్ కార్డ్ త‌ప్ప‌నిస‌రి.

ఆధార్‌-పీఎఫ్ లింక్ త‌ప్ప‌నిస‌రి: సెప్టెంబర్ నుంచి యజమానులు వారి కాంట్రీబ్యూష‌న్‌ను ఉద్యోగుల ఖాత‌కు క్రెడిట్ చేయాలంటే ఆధార్‌ను యూఏఎన్ (యూనివ‌ర్స‌ల్ అక్కౌంట్ నెంబ‌రు)కు త‌ప్ప‌నిస‌రిగా అనుసంధానించాలి. ఇందుకోసం ఈపీఎఫ్ సామాజిక భ‌ద్ర‌త‌ కోడ్ 2020లోని సెక్ష‌న్ 142ను కేంద్రం సవ‌రించింది. ఇత‌ర సేవ‌లు, ప్ర‌యోజ‌నాలు, చెల్లింపులు స్వీక‌రించేందుకు ఆధార్‌-యూఏఎన్ లింక్ త‌ప్ప‌నిస‌రి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని