Tata Ace EV: టాటా మోటార్స్‌ నుంచి ఏస్‌ EV... సింగిల్‌ ఛార్జ్‌తో 154 కిలోమీటర్లు

Tata Ace EV: దేశీయ ఆటో మొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata Motors) తన ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణిని విస్తరించుకుంటూ పోతోంది. బాగా ప్రాచుర్యం పొందిన ఏస్‌ మినీ ట్రక్‌.. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది.

Published : 05 May 2022 16:16 IST

ముంబయి: దేశీయ ఆటో మొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata Motors) తన ఎలక్ట్రిక్‌ వాహన శ్రేణిని విస్తరించుకుంటూ పోతోంది. తాజాగా బాగా ప్రాచుర్యం పొందిన ఏస్‌ మినీ ట్రక్‌.. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. టాటా ఏస్‌ మినీ ట్రక్‌ను లాంచ్‌ చేసిన 17 ఏళ్ల తర్వాత ఏస్‌ ఎలక్ట్రిక్‌ (Tata Ace EV) వెహికల్‌ను లాంచ్‌ చేసింది. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, బిగ్‌ బాస్కెట్‌, సిటీ లింక్‌, డాట్‌, ఫ్లిప్‌కార్ట్‌, లెట్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌, వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న టాటా మోటార్స్‌.. ఆయా సంస్థల నుంచి 39 వేల యూనిట్లకు ఆర్డర్లు కూడా పొందింది. ప్రస్తుతానికి దీని ధరను కంపెనీ వెల్లడించలేదు. వచ్చే త్రైమాసికం నుంచి వీటి డెలివరీలు ప్రారంభమైనప్పుడు ధరను వెల్లడించనున్నారు.

కొత్త ఏస్‌ ఈవీ 27Kw (36hp) మోటార్‌తో 130Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్‌ ఛార్జ్‌తో 154 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఇందులో అడ్వాన్స్‌ బ్యాటరీ కూలింగ్‌ సిస్టమ్‌ కూడా ఉంది. రెగ్యులర్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఇ-కామర్స్‌ లాజిస్టిక్స్‌ కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. పాసింజర్‌ కార్లు, బస్సులను సైతం ఎలక్ట్రిక్‌గా మారుస్తున్నామని, ఇప్పుడు ఈ-కార్గో వంతు వచ్చిందని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఈ సందర్భంగా అన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఏస్‌తో పాటు మరిన్ని కేటగిరీ వాహనాలను సైతం ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చనున్నట్లు చెప్పారు. సరిగ్గా 17 ఏళ్ల క్రితం వచ్చి ఏస్‌ మినీ ట్రక్‌.. ప్రభంజనం సృష్టించిందని, ఇప్పుడు కార్గో విభాగంలో ఏస్‌ ఈవీ సైతం అదే స్థాయిలో మన్ననను పొందుతుందని టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీశ్‌ వాఘ్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. ఏస్‌ ఈవీని మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ-కామర్స్‌, లాజిస్టిక్‌ సర్వీసులతో జట్టు కట్టినట్లు వివరించారు. 

మరోవైపు ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 500 కిలోమీటర్లు, అంతకంటే అధికదూరం ప్రయాణించే లక్ష్యంతో, విద్యుత్తు వాహనాలు తయారు చేసేందుకు సరికొత్త విద్యుత్‌ వాహన ఆర్కిటెక్చర్‌ అవిన్యా (వినూత్నత) (TATA Avinya) కాన్సెప్ట్‌ను టాటా మోటార్స్‌ (TATA Motors) ఇటీవల ఆవిష్కరించింది. జెన్‌ 3 ఆర్కిటెక్చర్‌పై రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్‌ వినియోగించుకుని, పలు అధునాతన విద్యుత్‌ వాహనాలను తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. తొలితరం విద్యుత్తు వాహనాలు ఒక ఛార్జింగ్‌తో 250 కి.మీ. ప్రయాణిస్తే, రెండోతరం కర్వ్‌ కాన్సెప్ట్‌కు 400-500 కి.మీ. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, మూడోతరమైన అవిన్యా (TATA Avinya)కు 500 కి.మీ... అంతకుమించిన ప్రయాణం లక్ష్యమని సంస్థ పేర్కొంది. కొత్త ఆర్కిటెక్చర్‌పై రూపొందించిన మొదటి మోడల్‌ 2025లో విపణిలోకి వచ్చే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని