TCS Q2 Results: టీసీఎస్‌ ఆదాయంలో 18 శాతం వృద్ధి.. ఒక్కోషేరుకు ₹8 డివిడెండ్‌

దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Published : 10 Oct 2022 17:30 IST

ముంబయి: దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై- సెప్టెంబర్‌) రూ.55,309 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 18 శాతం వృద్ధి చెందిందని తెలిపింది. కంపెనీ నికర లాభం సైతం 8.4 శాతం వృద్ధితో రూ.10,431 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.9,624 కోట్లుంగా ఉంది. గత త్రైమాసికంతో (రూ.9,478 కోట్లు) పోల్చినప్పుడు 10 శాతం మేర వృద్ధి చెందింది.

త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుపై వాటాదారులకు రూ.8 డివిడెండ్‌గా చెల్లించనున్నట్లు కంపెనీ పేర్కొంది. తమ సేవలకు బలమైన డిమాండ్‌ ఉందని, ఆర్డర్‌ బుక్‌ సైతం బలంగా ఉందని కంపెనీ సీఈఓ, ఎండీ రాజేశ్‌ గోపీనాథ్‌ వెల్లడించారు. రెండో త్రైమాసికంలో కొత్తగా 9,840 మంది ఉద్యోగులను చేర్చుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.16 లక్షలకు చేరిందని టీసీఎస్‌ తెలిపింది. క్యూ2 ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు 2 శాతం లాభంతో రూ.3,121 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని