TCS: ‘వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌’ నిబంధన.. అతిక్రమిస్తే చర్యలు తప్పవు!

వారంలో మూడు రోజుల పాటు ఆఫీసు నుంచే వర్క్‌ (Work From Office) చేయాలనే నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తాంటూ దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్‌ (TCS) తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తోంది.

Published : 01 Jun 2023 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ ఆంక్షలు ముగిసిన తర్వాత అనేక ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ (Work From Home)కు స్వస్తి పలుకుతున్నాయి. పలు సంస్థలు హైబ్రిడ్‌ విధానాన్ని అనుసరిస్తుండగా.. మరికొన్ని మాత్రం పూర్తిస్థాయిలో ఆఫీసు నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్‌ (TCS) కూడా వారంలో మూడు రోజుల పాటు ఆఫీసు నుంచే వర్క్‌ (Work From Office) చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. దీన్ని పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ ఉద్యోగులకు తాజాగా హెచ్చరికలు జారీ చేస్తోంది.

వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని తమ ఉద్యోగులకు టీసీఎస్‌ (TCS) గత అక్టోబర్‌ నుంచే సూచిస్తోంది. అలా నెలకు 12రోజుల పాటు ఆఫీసు నుంచే వర్క్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, కొందరు ఉద్యోగులు ఈ నిబంధనను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో అలాంటి వారికి తాజాగా నోటీసులు పంపించడం మొదలుపెట్టిన టీసీఎస్‌.. రోస్టర్‌ ప్రకారం నిర్దేశించిన కార్యాలయానికి తక్షణమే వచ్చి రిపోర్టు చేయాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని ఉద్యోగులకు జారీ చేసిన మెమోల్లో హెచ్చరించినట్లు సమాచారం.

ఇదే విషయంపై సంస్థ కూడా ఇటీవల స్పందిస్తూ.. ‘గత రెండేళ్లుగా కంపెనీలో ఎంతో మంది కొత్తగా నియమితులయ్యారు. నేర్చుకోవడం, కలిసి పనిచేయడం, వృద్ధి చెందడం, తోటి ఉద్యోగులతో ఉల్లాసంగా గడపడంతోపాటు సంస్థలో పని వాతావరణం అలవరచుకోవడం కూడా వారికి ఎంతో ముఖ్యం. సంస్థకు చెందినవారమనే భావనతోపాటు కలిసి పనిచేసేతత్వానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది’ అని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని