Tesla Cars: భారత్‌లో టెస్లా ప్రవేశం దిశగా ముందడుగు! 

టెస్లాకు చెందిన నాలుగు మోడళ్లు భారత్‌లో నడిపేందుకు అనువైనవిగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ధ్రువీకరించింది....

Published : 31 Aug 2021 20:10 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లోకి ప్రవేశించే దిశగా మరో ముందడుగు పడింది. ఈ సంస్థకు చెందిన నాలుగు మోడళ్లు భారత్‌లో నడిపేందుకు అనువైనవిగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ధ్రువీకరించింది. కర్బనఉద్గారాలు, భద్రత, ఇక్కడి రోడ్లపై తిరగగలిగే సామర్థ్యం వంటి అంశాల్లో టెస్లాకు చెందిన నాలుగు మోడళ్లు అనువైనవని కేంద్రం తెలిపింది. అయితే అవి ఏ మోడళ్లు అని కచ్చితంగా వెల్లడించనప్పటికీ.. ‘మోడల్‌ 3’, ‘మోడల్‌ వై’కి చెందిన వేరియంట్లు అయి ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గత కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. అయితే, సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌ ఓ షరతు విధించారు. తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్‌లో విక్రయిస్తామన్నారు. తర్వాతే స్థానికంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని తేల్చి చెప్పారు. అంతకంటే ముందు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ఇటీవల స్పందించిన సర్కార్‌.. ఎలాన్‌ మస్క్‌ కోరినట్లుగా దిగుమతి సుంకాలు తగ్గిస్తే భారత్‌లో తమ కార్యాచరణ ఏంటో వివరించాలని కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా టెస్లా మోడళ్లు భారత్‌లో నడపడానికి అనువైనవిగా కేంద్రం ధ్రువీకరించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని