Tesla: అంచనాలను మించి రాణించిన టెస్లా.. లాభంలో 59% వృద్ధి

Tesla: డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను బుధవారం టెస్లా ప్రకటించింది. ఆదాయ, లాభాలు అంచనాలను మించి నమోదయ్యాయి.

Published : 26 Jan 2023 14:59 IST

డెట్రాయిట్‌: కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla).. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే లాభాల్లో 59 శాతం వృద్ధి నమోదైంది. ఇతర వాహన తయారీ కంపెనీలతో పోలిస్తే ఈ ఏడాది టెస్లాకు.. సాఫ్ట్‌వేర్‌ సంబంధిత అదనపు ఆదాయాల కారణంగా భవిష్యత్తులో లాభాలు భారీగా ఉంటాయని అంచనా వేసింది.

వార్షిక ప్రాతిపదికన డిసెంబరు త్రైమాసికంలో లాభాలు 59 శాతం పెరిగి 3.69 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఒక్కో షేరుపై 1.19 డాలర్ల లాభం వచ్చినట్లు కంపెనీ తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం 24.32 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించాయని వెల్లడించింది. కంపెనీ ఆటోమోటివ్‌ విభాగం స్థూల లాభాలు మాత్రం 30.6 శాతం నుంచి 25.9 శాతానికి తగ్గినట్లు టెస్లా (Tesla) తెలిపింది.

ప్లాంట్ల మూసివేత, విడిభాగాల సరఫరాలో సమస్యల వంటి సవాళ్లు ఎదురైన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటిస్తున్నట్లు టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వ్యాఖ్యానించారు. అతిపెద్ద మార్కెట్లయిన అమెరికా, చైనాలో టెస్లా కొన్ని మోడళ్ల ధరలను 20 శాతానికి పైగా తగ్గించింది. గిరాకీ తగ్గడం వల్లే ఈ నిర్ణయం తీసుకుందన్న అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో త్రైమాసిక ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంచనాలకు భిన్నంగా టెస్లా మెరుగైన ఫలితాలను ప్రకటించడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది.

గత త్రైమాసికంలో 4 లక్షల మంది వినియోగదారులకు పూర్తి స్థాయి ‘సెల్ఫ్‌ డ్రైవింగ్‌ సాఫ్ట్‌వేర్‌’ను అందించామని టెస్లా పేర్కొంది. ఫలితంగా డిసెంబరు త్రైమాసికంలో 324 మిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది 18 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు ఆర్థిక అస్థిర పరిస్థితుల నేపథ్యంలో వ్యయ నియంత్రణ ప్రణాళికను మరింత వేగంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాని వెల్లడించింది.

ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్‌ (Elon Musk) టెస్లాను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆందోళన ఇన్వెస్టర్లలో నెలకొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది స్టాక్‌ ధర 65 శాతానికి పైగా కుంగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని