Budget 2023: కుటుంబ ‘బడ్జెట్’కు బీమా భరోసా!
Budget 2023: అన్ని ఖర్చులతో పాటు బీమా ప్రీమియంలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్లో బీమా పథకాలపై కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని సామాన్యులు ఆశిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కుటుంబ బడ్జెట్లో బీమా (Insurance) సంబంధిత ఖర్చులు కీలకంగా మారాయి. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్ (Budget 2023) నుంచి సామాన్యులు బీమా (Insurance) సంబంధిత ఉపశమనాలను ఆశిస్తున్నారు. బీమా పరిశ్రమ కూడా సామాన్యులకు ప్రయోజనాలను అందించాలని కోరుతోంది. ఫలితంగా పరిశ్రమ వృద్ధి చెంది అందరికీ బీమా పథకాలు అందుబాటులోకి వస్తాయని చెబుతోంది.
సెక్షన్ 80డీ పరిమితి పెంపు..
ప్రస్తుతం, 60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వ్యక్తులు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80D కింద తమకు, వారి జీవిత భాగస్వామికి, ఆధారపడిన పిల్లలకు లేదా తల్లిదండ్రుల కోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.25,000 ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపును పొందవచ్చు. తల్లిదండ్రుల వయసు 60 కంటే తక్కువ అయితే, వారి బీమా ప్రీమియం రూ. 25,000లపై ప్రత్యేక మినహాయింపూ ఉంటుంది. ఒకవేళ 60 ఏళ్లు పైబడిన వారైతే ఈ పరిమితి రూ. 50,000 వరకు ఉంది.
వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఎక్కువ హామీ మొత్తానికి బీమా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అలాంటప్పుడు ప్రీమియం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పన్ను మినహాయింపు పరిమితులను పెంచాలని సామాన్యులు కోరుతున్నారు. పైగా ఎక్కువ మంది బీమా తీసుకోవడానికి కూడా ఇది దోహదం చేస్తుంది.
జీవిత బీమా కోసం ప్రత్యేక సెక్షన్..
వ్యక్తిగత పాలసీదారుడు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. జీవిత బీమా ప్రీమియంలతో పాటు 80C కింద ‘యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్’లు (ULIP) సహా ఇతర పెట్టుబడులు కూడా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCC కింద ఒక వ్యక్తి యాన్యుటీ లేదా పెన్షన్ ప్లాన్ల కోసం చేసే చెల్లింపులపై మినహాయింపునకు అనుమతిస్తోంది. మొత్తం మినహాయింపు పరిమితిని నిర్ణయించడానికి సెక్షన్ 80CCC కింద మినహాయింపులను కూడా 80Cతో కలుపుతున్నారు. ప్రస్తుతం, సెక్షన్ 80C పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఐదేళ్ల టైమ్ డిపాజిట్, జీవిత బీమా ప్రీమియంలు, ELSS మ్యూచువల్ ఫండ్లు, గృహ రుణాలపై చెల్లించే వడ్డీ సహా మరికొన్ని పెట్టుబడులపై మినహాయింపులను అనుమతిస్తోంది.
ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ.. 80సీ గరిష్ఠ పరిమితి తొమ్మిదేళ్లుగా రూ. 1.5 లక్షలుగానే ఉంది. ఈ నేపథ్యంలో జీవిత బీమాను ప్రజలకు మరింత చేరువచేసేందుకు సెక్షన్ 80డీ తరహాలో జీవిత బీమా ప్రీమియం మినహాయింపు కోసం ప్రత్యేక విభాగం ఉండాలని నిపుణులు కోరుతున్నారు.
పింఛను ప్లాన్లకూ 80CCD
జాతీయ పింఛను పథకం (NPS)లో చేసే పెట్టుబడిపై రూ. 50,000 వరకు ప్రస్తుతం, సెక్షన్ 80CCD(1B) కింద ప్రత్యేక పన్ను మినహాయింపు ఉంది. కానీ జీవిత బీమా కంపెనీలు అందించే పింఛను లేదా యాన్యుటీ ప్లాన్లకు (సెక్షన్ 80CCC) మాత్రం ప్రత్యేక మినహాయింపు లేదు. వాటిని సెక్షన్ 80C కింద ఇచ్చే రూ. 1.5 లక్షల పరిధిలోనే కలిపేశారు. అయితే, సెక్షన్ 80CCD కింద ఇచ్చే మినహాయింపును బీమా సంస్థలు అందించే పింఛను, యాన్యుటీ ప్రీమియంలకు కూడా విస్తరించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
జీఎస్టీ తగ్గించాలి..
భారతదేశంలో ఆరోగ్య బీమా వ్యాప్తిని మెరుగుపరచడానికి, ‘ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)’ గత కొన్ని సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో వస్తు, సేవల పన్ను (GST)ను తగ్గించడం ద్వారా బీమా పాలసీలను మరింత అందుబాటు ధరల్లోకి తీసుకురావచ్చని బీమా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించడం అందుకు దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇతర బీమాలకూ మినహాయింపులు..
ప్రస్తుతం, జీవిత బీమా ప్రీమియం కోసం సెక్షన్ 80C కింద మినహాయింపు అందుబాటులో ఉంది. ఆరోగ్య బీమా ప్రీమియంలకు సెక్షన్ 80D కింద మినహాయింపు ఇస్తున్నారు. కానీ, ప్రయాణ బీమా, గృహ బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీల్లో చెల్లించే ప్రీమియంలపై మాత్రం ఎలాంటి మినహాయింపు అందుబాటులో లేదు. వీటికి కూడా పన్ను మినహాయంపులను వర్తింపజేయాలనే డిమాండ్ ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.