Financial Planning: కొత్త ఏడాదిలో ఎలా ముందుకెళ్లాలి? 2022 నేర్పిన ఆర్థిక పాఠాలేంటి?

2022 ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? నూతన సంవత్సరంలో వీటిని ఎలా సరిచేసుకోవాలి? ఇప్పుడు చూద్దాం.

Updated : 25 Dec 2022 11:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొద్దిరోజుల్లో పాత ఏడాదికి వీడ్కోలు పలికి.. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించే ముందు పాత ఏడాది నుంచి కొన్ని ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలి. ఈ విషయంలో 2022 చాలా ఆర్థిక పాఠాలనే నేర్పింది.  భౌగోళిక రాజకీయ అశాంతి కారణంగా ఈ ఏడాది తీవ్రమైన ఆర్థిక అస్థిరత ఏర్పడింది. ద్రవ్యోల్బణం (Inflation), ఉద్యోగ తొలగింపులు, క్రిప్టోకరెన్సీ (Cryptocurrency) పతనం, మాంద్యం భయాలు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేశాయి. కాబట్టి వీటి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని కొత్త ఏడాదిలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి.

క్రిప్టో పతనం..

2022 సంవత్సరం ప్రారంభంలో క్రిప్టో కరెన్సీ అద్భుతమైన లాభాలతో అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడుల్లో ఒకటిగా చేరింది. అతి తక్కువ సమయంలో అధిక రాబడిని అందిస్తూ, ముఖ్యంగా యువ పెట్టుబడిదారుల్లో విపరీతమైన ప్రజాదరణ పొందింది. అయితే, ఈ కరెన్సీ క్రమబద్ధం లేని పెట్టుబడి కావడం వల్ల తర్వాత కాలంలో ప్రమాదకరమని నిరూపితమైంది. దీని విలువ భారీగా పతనం కావడంతో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులకు గట్టి షాకిచ్చినట్లయ్యింది. దీంతో నియంత్రణ లేని, ఊహాజనిత పెట్టుబడుల జోలికి పోకూడదని క్రిప్టో కరెన్సీలు నిరూపించాయి. క్రిప్టోకరెన్సీ పతనం ఒక ముఖ్యమైన ఆర్థిక పాఠాన్ని బోధించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మెరిసేదంతా బంగారం కాదని మరోసారి నిరూపితమైందని అంటున్నారు. కాబట్టి సరైన అవగాహన ఉన్న సాధనాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలని వారు సూచిస్తున్నారు. 

ఈక్విటీ మార్కెట్‌

2022 ప్రథమార్ధంలో స్టాక్‌ మార్కెట్‌ కొంత క్షీణతను చవిచూసింది. భౌగోళిక రాజకీయ అశాంతి, ప్రతికూల మార్కెట్‌ వ్యాఖ్యానాల కారణంగా చాలా పెట్టుబడిదారులు తమ స్టాక్‌ హోల్డింగ్‌లను వదులుకున్నారు. కానీ ద్వితీయార్ధంలో మన మార్కెట్లు బలమైన రికవరీని సాధించాయి. ఓ దశలో సూచీలు తన గరిష్ఠ స్థాయిలను కూడా అధిగమించాయి. సంవత్సర ప్రారంభంలో మార్కెట్‌ అస్థిరత ఉన్నప్పటికీ 2022 డిసెంబరు ప్రధమార్థం వరకు ఉన్న పెట్టుబడిదారులు అత్యధికంగా లాభపడ్డారు. గత కొద్దిరోజులుగా మార్కెట్ కొంత పతనం అవ్వడం వల్ల లాభాలు కొంత మేరకు తగ్గాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్కెట్‌ హెచ్చుతగ్గులు మరింత పెట్టుబడి పెట్టడానికి అనువైన అవకాశం. ఈక్విటీ మార్కెట్‌లో మీరు ఎంత ఎక్కువ కాలం ఉంటారో.. అంత ప్రతిఫలం ఉంటుందని మరోసారి నిరూపితమైంది.

వడ్డీ రేట్ల పెంపు

దాదాపు రెండు సంవత్సరాల స్తబ్దత తర్వాత, 2022 మే నుంచి కీలక వడ్డీ రేట్లు భారీగా 225 బేసిస్‌ పాయింట్లు పెరిగాయి. ఫలితంగా, ఈఎంఐలు పెరిగి రుణాలు చాలా ఖరీదైనవిగా మారాయి. ఈ వడ్డీ చెల్లింపుల భారాన్ని ఎదుర్కోడానికి మీ రుణ మొత్తంలో కొంతవరకైనా మందస్తు చెల్లింపులు చేయడం మంచిది. మీకు సంస్థ ద్వారా లభించే ప్రొత్సాహకాలు, బోనస్‌లు లాంటివి ఉన్నప్పుడు వాటిని ఈ ముందస్తు రుణ చెల్లింపులకు ఉపయోగించాలి. ఇవి మీ రుణ కాలపరిమితిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, దీర్ఘకాలంలో వడ్డీ భారాన్ని తగ్గిస్తాయి.

ద్రవ్యోల్బణం

ఈ ఏడాది ద్రవ్యోల్బణం అనేక వస్తువుల ధరలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇంధన ధరలు కూడా ఊతమిచ్చాయి. ఆహారం, మందులు, దుస్తులు, రవాణా, విద్య, ఇంకా అనేక నిత్యావసర వస్తువులు, సేవల ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఇప్పుడు అనుభవిస్తున్న ధరల పరిస్థితి ప్రజలందరికీ కీలకమైన గుణపాఠాన్నే చెప్పింది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కొనుగోలు శక్తిని సరిగ్గా నిర్వహించడానికి పెట్టుబడులు పెంచడం ఉత్తమ మార్గం. ప్రతి ఏడాదీ మీ పెట్టుబడులను సమీక్షించుకోవాలి. మీ మూల ధనాన్ని తగిన వృద్ధి-ఆధారిత పెట్టుబడుల వైపు మళ్లించాలి. కేవలం సంప్రదాయ డిపాజిట్లపై ఆధారపడకూడదు. ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులు అందించే పెట్టుబడులను అన్వేషించాలి.

ఆర్థిక మాంద్యం

గత కొన్ని నెలలుగా ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యోగాల తొలగింపునకు దారితీసింది. స్థిరమైన ఆదాయాన్ని కోల్పోవడం ఓ సవాలే. అయితే, ఈ లేఆఫ్‌లకు విరుగుడుగా వృత్తి, ఉపాధి ద్వారా సంపాదించే ప్రతి వ్యక్తి 12 నెలల ఖర్చులను కవర్‌ చేయడానికి అత్యవసర నిధిని కలిగి ఉండడాన్ని ముందు నుంచే ప్లాన్‌ చేసుకోవాలి. ఈ నిధిని బ్యాంకు పొదుపు ఖాతా వంటి సులభంగా ఉపసంహరణ సాధానాల్లో జమచేయాలి.

చివరిగా: ప్రతి సంవత్సరం ఆర్థిక ప్రణాళిక విషయానికి వచ్చేసరికి కొన్నిసార్లు తప్పులు అనివార్యం కావచ్చు. కానీ, ఈ తప్పుల నుంచి నేర్చుకోవడం, భవిష్యత్‌ ప్రణాళికలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ఇక్కడ నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం. కాబట్టి, రాబోయే నూతన సంవత్సరంలో మరింత మెరుగ్గా ఆర్థిక ప్రణాళికను ప్లాన్‌ చేసుకోవడానికి ప్రయత్నించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని