Tim Cook: యాపిల్ ఉద్యోగులకు లేఆఫ్‌లు.. టిమ్‌ కుక్‌ ఏమన్నారంటే?

యాపిల్‌ (Apple) కంపెనీ రిటైల్‌ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ (Tim Cook) లేఆఫ్‌ల గురించి మాట్లాడారు. ఇంతకీ లేఆఫ్‌ల గురించి టిమ్‌ ఏం చెప్పారంటే?  

Published : 08 May 2023 18:08 IST

కాలిఫోర్నియా: ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌ (Layoffs)లు విధిస్తున్నాయి. గతేడాది ట్విటర్‌ (Twitter)తో ప్రారంభమై.. అమెజాన్‌ (Amazon), మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google), మెటా (Meta) వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ, యాపిల్‌ (Apple) మాత్రం ఇప్పటి వరకు లేఆఫ్‌ల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా లేఆఫ్‌ల గురించి యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ (Tim Cook) మాట్లాడారు. అన్ని దార్లు మూసుకుపోయిన తరుణంలో చివరి అంశంగా మాత్రమే లేఆఫ్‌ల గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. 

యాపిల్‌ కంపెనీ రిటైల్‌ విభాగంలో ఇటీవల కొద్ది మంది ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలు వెలువడటంతో ఉద్యోగుల్లో లేఆఫ్‌లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో టిమ్‌ కుక్‌ ప్రకటన ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించింది. మరోవైపు ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునే విషయంలో కంపెనీ తెలివిగా వ్యవహరిస్తుందని కుక్‌ తెలిపారు. ‘‘ ప్రస్తుతం అందరు మాట్లాడుతున్నట్లుగా లేఆఫ్‌లు ఇప్పట్లో ఉండవకపోవచ్చు. కానీ, లేఆఫ్‌ల నిర్ణయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. నియామకాల ప్రక్రియను కూడా కొనసాగిస్తాం. అయితే, గతంలో కంటే తక్కువ మొత్తంలోనే ఉద్యోగులను నియమించుకుంటాం. ప్రస్తుతం కంపెనీకి ఎదురయ్యే సవాళ్లను సరైన పద్ధతిలో ఎదుర్కొంటున్నాం. కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం’’ అని టిమ్‌ కుక్‌ తెలిపారు. 

యాపిల్‌ కంపెనీ గత త్రైమాసికంలో 24.1 బిలియన్‌ డాలర్ల లాభాలను నమోదు చేసింది. ఇందులో ఐఫోన్‌ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయమే అధికమని కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఐఫోన్ విక్రయాలు 1.5 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. మరోవైపు మాక్‌ కంప్యూటర్ల అమ్మకాల్లో గత త్రైమాసికం కంటే 30 శాతం క్షీణించడంతోపాటు.. యాపిల్ వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌ వంటి వేరబుల్స్‌ అమ్మకాలు కూడా తగ్గినట్లు పేర్కొంది. దీంతో వాటి అమ్మకాలను పెంచడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే 90 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను కూడా యాపిల్ ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని