Kisan Vikas Patra: కేవీపీలో ఇన్వెస్ట్‌ చేస్తే మీ డబ్బు ఎన్నేళ్లలో రెట్టింపవుతుందో తెలుసా?

కేవీపీ స‌ర్టిఫికెట్‌లో ఒక వ్య‌క్తి గ‌రిష్ఠ ప‌రిమితి లేకుడా క‌నీసం రూ.1000 పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. మరి ఆ డబ్బు ఎన్నేళ్లలో రెట్టింపవుతుందో తెలుసా?

Updated : 18 Jan 2022 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిసాన్ వికాస్ ప‌త్ర (కేవీపీ) ఒక పోస్టాఫీసు పొదుపు పథకం. దీంట్లో మీ డ‌బ్బు రెట్టింపు అవ్వ‌డానికి 124 నెల‌లు (10 సంవ‌త్స‌రాల 4 నెల‌లు) ప‌డుతుంది. మార్కెట్ హెచ్చుత‌గ్గుల‌తో సంబంధం లేకుండా హామీ మొత్తం ల‌భిస్తుంది. దీర్ఘ‌కాలానికి పొదుపు చేయాల‌నుకునే పెట్టుబ‌డిదారులు కిసాన్ వికాస్ ప‌త్ర (కేవీపీ)లో పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిదే. ప్ర‌భుత్వ గ్యారెంటీ ద్వారా పెట్టుబ‌డి మొత్తం సుర‌క్షితంగా ఉండ‌ట‌మే కాకుండా పెట్టుబ‌డిదారుడు సంపాదించిన వ‌డ్డీకి కూడా భద్రత ఉంటుంది. కేవీపీ స‌ర్టిఫికెట్‌ల‌లో ఒక వ్య‌క్తి గ‌రిష్ఠ ప‌రిమితి లేకుండా, క‌నీసం రూ.1000 వరకు మదుపు చేయొచ్చు. ప్ర‌స్తుతం ఈ ప‌థ‌కానికి పోస్టాఫీసు ఇస్తున్న వ‌డ్డీరేటు 6.90%. ప్ర‌జ‌ల‌లో దీర్ఘ‌కాలిక ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ప్రోత్స‌హించ‌డ‌మే ప‌థ‌కం ల‌క్ష్యం. ఈ స్కీమ్‌లో వివిధ ర‌కాల కిసాన్ వికాస్ ప‌త్ర స‌ర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. సింగిల్ హోల్డ‌ర్ టైప్ స‌ర్టిఫికెట్ పెద్ద‌ల‌ కోసం జారీ చేస్తారు. మైన‌ర్ త‌ర‌ఫున జారీచేసే `కేవీపీ` స‌ర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. అంతేగాక పెద్ద‌ల‌కు జాయింట్‌గా కూడా జారీ చేస్తారు.

కిసాన్ వికాస్ ప‌త్ర  వల్ల కలిగే మొట్టమొదటి ప్ర‌యోజ‌నం మన పెట్టుబడిపై వచ్చే రాబడికి హామీ ఉండడం. ఈ స్కీమ్ గడువు 124 నెల‌లు అయిన‌ప్ప‌టికీ, లాక్‌-ఇన్ వ్య‌వ‌ధి 30 నెల‌లు. కావాలంటే అంతకుముందు కూడా క్లోజ్ చేసుకునే వెసులుబాటు ఉందిద. కానీ 30 నెల‌ల త‌ర్వాత మాత్ర‌మే హామీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. దీనికోసం ఖాతాదారుడు ధ‌ర‌ఖాస్తు ఫార‌ం-2ను పోస్టాఫీసుకు స‌మ‌ర్పించాలి. కిసాన్ వికాస్ ప‌త్ర‌లో రూ 1000 ఇన్వెస్ట్ చేస్తే, లాక్‌-ఇన్ పీరియ‌డ్ ముగిసే స‌మ‌యానికి, 30 నెల‌ల నుంచి 36 నెలల లోపు విత్‌డ్రా చేస్తే రూ.1154 మొత్తాన్ని పొందుతారు. 60 నుంచి 66 నెలల లోపు విత్‌డ్రా చేస్తే రూ.1332 ల‌భిస్తుంది. ఏడున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి 8 ఏళ్ల లోపు విత్ డ్రా చేస్తే రూ.1537 ల‌భిస్తుంది.

ఇంకా పోస్టాఫీసు వివిధ ర‌కాల డిపాజిట్ ప‌థ‌కాల‌ను అందిస్తుంది. ఇవి పెట్టుబ‌డిదారుల‌లో బాగా ప్రాచుర్యం పొందాయి.  ఈ ప‌థ‌కాల‌లో కొన్ని ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌తో కూడా వ‌స్తాయి. కాబ‌ట్టి చాలా మంది పెట్టుబ‌డిదారులు త‌మ పోర్ట్ఫోలియోలో ఈ ప‌థ‌కాల‌ను క‌లిగి ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. అనేక పొదుపు ప‌థ‌కాల‌లో పోస్టాఫీసు ‘టైమ్ డిపాజిట్’ ఖాతా (టీడీ), పోస్టాఫీసు ‘మంత్లీ ఇన‌క‌మ్ స్కీమ్’ ఖాతా (ఎంఐఎస్‌), సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్ఎస్‌), పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా, నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్లు (ఎన్ఎస్‌సీ) ఉన్నాయి. బాలిక‌ల‌కు అధిక వ‌డ్డీనిచ్చే సుక‌న్య స‌మృద్ది ఖాతా, 5 సంవ‌త్స‌రాల పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా (ఆర్‌డీ), ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (పీపీఎఫ్‌) ప‌థ‌కాలు వేర్వేరు ల‌క్ష్యాల‌తో వివిధ ర‌కాల స్కీముల‌తో పెట్టుబ‌డిదారుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. ప్ర‌ముఖ‌ బ్యాంకు డిపాజిట్ల‌తో పోలిస్తే పోస్టాఫీసు పథకాలతో పెట్టుబ‌డిదారుల‌కు ల‌భించే వ‌డ్డీ రేటు ఎక్కువే.

ప‌న్ను ఆదా ప‌థ‌కాల కోసం అన్వేషిస్తున్న పెట్ట‌బ‌డిదారులు పీపీఎఫ్ (ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌), ఎన్ఎస్‌సీ (నేష‌న‌ల్ సేవింగ్ స‌ర్టిఫికెట్లు), ప‌న్ను ఆదా చేసే బ్యాంక్ ఎఫ్‌డీ ప‌థ‌కాలు లేదా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్‌) వంటి పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని