Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా? ఈ చిట్కాలతో మోసాలకు అడ్డుకట్ట!

Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరుగుతున్న కొద్దీ సైబర్‌ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. పాస్‌వర్డ్‌ల స్థానంలో బయోమెట్రిక్స్‌.. ఓటీపీని ఇతరులో పంచుకోకపోవడం వంటి మార్గాల ద్వారా వాటిని అరికట్టొచ్చు.

Updated : 14 Dec 2022 12:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆన్‌లైన్‌లో షాపింగ్‌ (Online Shopping) చేయడం పెరిగింది. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది దీన్ని సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆన్‌లైన్‌ షాపింగ్‌ (Online Shopping) వైపు ఆకర్షిస్తున్నాయి. కొత్త కొత్త యాప్‌లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది.అయితే, సైబర్‌ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మరి వీటిని అరికట్టడానికి ఉన్న కొన్ని సులువైన మార్గాలేంటో చూద్దాం..

పాస్‌వర్డ్‌ల కంటే బయోమెట్రిక్స్‌ ఉత్తమం..

పాస్‌వర్డ్‌ (Password)లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్‌ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాల్సి వస్తుంటుంది. దీనికి బదులు బయోమెట్రిక్స్‌ (Biometrics), ఇ-సిగ్నేచర్స్‌ (e-signatures) వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. పైగా వీటిని సురక్షితంగా కాపాడడం బ్యాంకుల బాధ్యత. కాబట్టి మోసాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.

రెండంచెల ధ్రువీకరణ..

ఆన్‌లైన్‌లో షాపింగ్‌ (Online Shopping) చేసి చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ (multi-factor authentication) విధానాన్ని అనుసరించాలి. కేవలం ఒక్క పాస్‌వర్డ్‌తోనే కాకుండా ఓటీపీ, బయోమెట్రిక్స్‌, మెయిల్, ఎస్‌ఎంఎస్‌, మొబైల్‌ ఇలా.. అనేక ప్రత్యామ్నాయాల ద్వారా మీ వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అవలంబించాలి. హ్యాకర్లు ఒకవేళ మీ పాస్‌వర్డ్‌ను హ్యాక్‌ చేసినా.. రెండో ధ్రువీకరణ కోసం మీ అనుమతి కచ్చితంగా ఉండాల్సిందే. అలా మీ ప్రమేయం లేకుండా ఎవరైనా మీ ఖాతాలను యాక్సెస్‌ చేస్తే వెంటనే మీకు తెలిసిపోతుంది. 

రిమోట్‌ యాక్సెస్‌ ఇవ్వొద్దు..

మన కంప్యూటర్‌ లేదా ఫోన్‌ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్‌ యాక్సెస్‌ (remote access) ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్‌లైన్‌ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. లేదా స్క్రీన్‌ రికార్డర్‌ వంటి మార్గాల ద్వారా మీ పాస్‌వర్డ్‌ (Password)లు, ఇతర వివరాలన్నీ సులువుగా తెలుసుకోగలుతారు. ఒక్కోసారి మీ కంప్యూటర్‌ లేదా ఫోన్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలను తెలుసుకొని లాక్‌ కూడా చేయొచ్చు. తిరిగి ఓపెన్‌ చేయడానికి ఎంతో కొంత డబ్బు డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. లేదా ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశం ఉంది.

ఓటీపీని షేర్‌ చేయొద్దు..

ఆన్‌లైన్‌ లావాదేవీలు పుంజుకుంటున్న కొద్దీ సైబర్‌ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్‌ దగ్గర విశ్వసనీయతను సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ దోచేస్తుంటారు. ‘మీకు వచ్చిన ఓటీపీ చెబితేనే నేను మీకు కావాల్సిన పని చేసిపెట్టగలను’ అని సున్నితంగా చెబుతూనే మోసం చేసేస్తారు. అందువల్ల ఫోన్‌లోగానీ, ఆన్‌లైన్‌లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి.

పబ్లిక్‌ వైఫైతో జాగ్రత్త..

ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్‌/ఓపెన్‌ వైఫైని ఉపయోగించకపోవడమే ఉత్తమం. పబ్లిక్‌ వైఫై ద్వారా మధ్యలో కొందరు దూరి మీ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం మీ సొంత నెట్‌వర్క్‌, మీ సొంత డివైజ్‌నే వాడాలి. ఎప్పటికప్పుడు మీ మెయిల్‌ను కూడా చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఫలితంగా ఏదైనా అనధికార లావాదేవీ జరిగినా వెంటనే చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

ఆన్‌లైన్‌ షాపింగ్‌, వాటికి సంబంధించిన లావాదేవీలు క్రమంగా మన జీవితంలో భాగమైపోతున్నాయి. వీటి నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి. అందుకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో ఎట్టిపరిస్థితుల్లోనూ సున్నితమైన సమాచారాన్ని పంచుకోవద్దు. ముఖ్యంగా ఫోన్‌, ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు