TRAI: అనధికార ఫోన్‌ కాల్స్‌, సందేశాలకు చెక్‌.. ట్రాయ్‌ పటిష్ఠ చర్యలు

TRAI: అనధికార కాల్స్‌, సందేశాలను నియంత్రించేందుకు ఇప్పటికే టెలికాం సంస్థలు చర్యల్ని ముమ్మరం చేశాయని ట్రాయ్‌ తెలిపింది. అయితే, ఇంకా చేయాల్సి చాలా ఉందని పేర్కొంది.

Published : 28 Mar 2023 20:48 IST

దిల్లీ: తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తూ వివిధ కంపెనీల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ చిరాకు తెప్పిస్తున్నాయి కదా? ఆ బెడద నుంచి వినియోగదారులను ఊరట కల్పించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ విషయంపై టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలతో పలుసార్లు సమీక్ష జరిపింది. యూజర్లను ఇబ్బంది పెడుతున్న ప్రచార సందేశాలు, కాల్స్‌ను నియంత్రించేందుకు చేపట్టాల్సిన పలు ఆదేశాలను జారీ చేసింది. తాజాగా ఈ విషయంపై ట్రాయ్‌ మరోసారి సమీక్ష నిర్వహించింది.

ముఖ్యంగా ఇలాంటి కాల్స్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధికంగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో వీటిని నిలువరించేందుకు ప్రముఖ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియాతో ట్రాయ్‌ సమీక్ష నిర్వహించింది. వినియోగదారులను ఇబ్బంది పెట్టే అనధికార ప్రచార సందేశాలు, కాల్స్‌ను నియంత్రించాలని ఆదేశించింది. ఇవే ఒక్కోసారి మోసాలు, స్కామ్‌లను కారణమవుతున్నాయని వివరించింది. మోసపూరిత సందేశాలను పసిగట్టగలిగే కృత్రిమ మేధ/మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారిత వ్యవస్థను ఈ సమీక్షా సమావేశంలో వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea- Vi) ట్రాయ్‌ ముందుంచింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు వీఐకి అనుమతి ఇచ్చింది. దాని ఫలితం ఆధారంగా ఇలాంటి పరిష్కారాల అమలుకు తగిన నిబంధనలతో మార్గదర్శకాలను తీసుకొస్తామని ట్రాయ్‌ స్పష్టం చేసింది.

అనధికార కాల్స్‌, సందేశాలను నియంత్రించేందుకు ఇప్పటికే టెలికాం సంస్థలు చర్యల్ని ముమ్మరం చేశాయని ట్రాయ్‌ తెలిపింది. అయితే, ఇంకా చేయాల్సి చాలా ఉందని పేర్కొంది. ప్రస్తుతం అనధికార ప్రచార సందేశాలను అరికట్టేందుకు అమలు చేస్తున్న బ్లాక్‌చైన్‌ ఆధారిత ‘డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ (DLT)’ని మే 1 నుంచి కాల్స్‌కు కూడా వర్తింపజేస్తామని తెలిపింది.  

అలాగే అనధికారికంగా, ఇబ్బందికర ప్రచార సందేశాలను పంపుతున్న టెలిమార్కెటర్లకు చెందిన హెడ్డర్‌లు, మెసేజ్‌ టెంప్లెట్‌ల దుర్వినియోగాన్ని ఆపేందుకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాల అమలునూ ట్రాయ్‌ సమీక్షించింది. డీఎల్‌టీ ప్లాట్‌ఫామ్‌పై నమోదైన అన్ని హెడ్డర్‌లు, మెసేజ్‌ టెంప్లెట్‌లను మళ్లీ వివరాలు ధ్రువీకరించుకోవాలని చేసిన సూచనను ఎంత వరకు అమలు పురోగతిని పరిశీలించింది. ధ్రువీకరించని హెడ్డర్‌లు, మెసేజ్‌ టెంప్లెట్‌లను వరుసగా 30 రోజులు, 60 రోజుల్లోగా నిలిపివేయాలని ఆదేశించింది. డీఎల్‌టీ ప్లాట్‌ఫామ్‌పై నమోదుకాని టెలిమార్కెటర్లు, మెసేజ్‌లు పంపకుండా నిషేధించాలని తెలిపింది. అనధికార టెలిమార్కెటర్లు, టెలిఫోన్‌ నంబర్లు వినియోగించే టెలిమార్కెటర్ల నుంచి ప్రచార సందేశాలు రాకుండా చూసుకోవాలని ట్రాయ్‌ ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని