Train Ticket Cancellation: రైలు టికెట్‌ రద్దు చేసుకున్నా.. జీఎస్‌టీ కట్టాల్సిందే!

Train Ticket Cancellation: రైలు టికెట్‌ బుక్‌ చెసుకుంటేనే కాదు.. ఇకపై రద్దు చేసుకున్నా జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. టికెట్‌ తరగతిని బట్టి రేటును వర్తింపజేస్తారు...

Updated : 29 Aug 2022 13:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగల సీజన్‌ సమీపిస్తోంది. ఈ సమయంలో రైల్వే టికెట్లకు ఉండే డిమాండ్‌ గురించి చెప్పాల్సిన అసవరం లేదు. సీటు కన్ఫర్మ్‌ చేసుకోవడం కోసం ప్రయాణికులు చాలా ముందే టికెట్‌ బుక్‌ చేసుకుంటుంటారు. అయితే, చివరి క్షణంలో ప్రణాళికలో మార్పులు, ఇతర అత్యవసర పనుల కారణంగా ఒక్కోసారి టికెట్‌ రద్దు (Train Ticket Cancellation) చేసుకోవాల్సి వస్తుంటుంది.

టికెట్‌ను రద్దు (Train Ticket Cancellation) చేసుకుంటే భారతీయ రైల్వే రుసుము వసూలు చేస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యవహారం కొంత ఖరీదుగా మారింది. ఎందుకంటే రద్దు చేసుకున్నందుకు చెల్లించే రుసుముపై ఇకపై అదనంగా ‘వస్తు సేవల పన్ను (GST)’ కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైలు టికెట్లతో పాటు హోటల్‌ బుకింగ్‌లను రద్దు చేసుకున్నా జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం.. ప్రయాణికుడికి కావాల్సిన సేవలను అందిస్తానని సర్వీసు ప్రొవైడర్‌ అంగీకరిస్తూ చేసుకున్న ఒప్పందమే రైలు టికెట్‌. మరి టికెట్‌ను రద్దు చేసుకొని ప్రయాణికుడు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే.. దానికి ప్రత్యేకంగా రుసుము చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం వివరించింది. దాన్నే ‘టికెట్‌ క్యాన్సిలేషన్‌ ఛార్జెస్‌’గా వ్యవహరిస్తున్నాం. ఈ రుసుము కూడా చెల్లింపుల పరిధిలోకి వస్తుంది గనక జీఎస్‌టీ వర్తిస్తుందని ఆర్థిక శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఉదాహరణకు ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ టికెట్‌పై ఐదు శాతం జీఎస్‌టీ వసూలు చేస్తారు. అదే రేటు టికెట్‌ రద్దుకు కూడా వర్తిస్తుంది. 48 గంటల ముందు ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌ రద్దు చేసుకుంటే భారతీయ రైల్వే రూ.240 క్యాన్సిలేషన్‌ ఛార్జీ వసూలు చేస్తోంది. ఈ టికెట్‌ను బుక్‌ చేసుకునేటప్పుడు ముందు చెప్పినట్లుగా ఐదు శాతం జీఎస్‌టీ చెల్లిస్తాం. రద్దు ఛార్జీలకు కూడా అదే రేటు వర్తింపజేస్తే రూ.12 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకోవడానికి మొత్తం రూ.252 (రూ.240+రూ.12) కట్టాల్సిందే.

48 గంటల ముందు ఏసీ 2-టైర్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే రూ.200, ఏసీ 3-టైర్‌ టికెట్‌ క్యాన్సిలేషన్‌పై రూ.180 వసూలు చేస్తున్నారు. అదే 48-12 గంటల మధ్య రద్దు చేసుకుంటే టికెట్‌ ధరలో 25 శాతం, 12-4 గంటల మధ్య రద్దు చేసుకుంటే టికెట్‌ ధరపై 50 శాతం క్యాన్సిలేషన్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటిపై 5 శాతం జీఎస్‌టీ అదనం.

సెకండ్‌ క్లాస్‌ స్లీపర్‌ టికెట్‌ను రద్దు చేసుకుంటే మాత్రం ఎలాంటి జీఎస్‌టీ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని