Twitter Vs Microsoft: మైక్రోసాఫ్ట్‌ మా డేటాను అక్రమంగా వినియోగిస్తోంది: ట్విటర్‌

Twitter Vs Microsoft: డేటా వినియోగం విషయంలో మైక్రోసాఫ్ట్‌పై ట్విటర్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు లేఖ రాసింది.

Updated : 19 May 2023 19:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ డేటాను టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) అక్రమంగా ఉపయోగించుకుంటోందని ట్విటర్‌ (Twitter) ఆరోపించింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లకు గురువారం లేఖ రాసింది. ట్విటర్‌ డేటా వినియోగం విషయంలో మైక్రోసాఫ్ట్‌ నిబంధనలను అతిక్రమించిందని లేఖలో ఆరోపించింది. పైగా దీనికి డబ్బులు చెల్లించడానికి కూడా నిరాకరిస్తోందని తెలిపింది.

నిబంధనల ప్రకారం ఉపయోగించాల్సిన దాని కంటే అధిక డేటాను మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ఉపయోగించుకుందని ట్విటర్‌ (Twitter) లేఖలో ఆరోపించింది. అలాగే ఎలాంటి అనుమతి లేకుండా తమ డేటాను ప్రభుత్వ ఏజెన్సీలతో పంచుకున్నట్లు పేర్కొంది. ఇలా పలు విధాలుగా మైక్రోసాఫ్ట్‌ నిబంధనలను ఉల్లంఘించిందని ఎలాన్‌ మస్క్‌ వ్యక్తిగత న్యాయవాది అలెక్స్‌ స్పైరో.. నాదెళ్లకు పంపిన లేఖలో ఆరోపించారు.

తమ డేటాను వినియోగించుకుంటున్న మైక్రోసాఫ్ట్‌ (Microsoft) నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే ట్విటర్‌ (Twitter) ఈ చర్యకు ఉపక్రమించి ఉండొచ్చని టెక్‌ నిపుణులు అంటున్నారు. తాజాగా పంపిన లేఖ దానికి నాంది అయి ఉండొచ్చని భావిస్తున్నారు. గత ఏడాది ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు దివాలా అంచున ఉన్న ఈ కంపెనీని గట్టెక్కించేందుకు ఆయన పలు చర్యలు చేపట్టారు. ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ పాలసీని తీసుకొచ్చారు. ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించారు. ఈ క్రమంలోనే తమ డేటాను వినియోగించుకుంటున్న కంపెనీల నుంచి ఆదాయం సమకూర్చుకోవడాన్ని కూడా ట్విటర్‌ ఒక మార్గంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్‌ (Microsoft)పై ఎలాన్‌ మస్క్‌ గత నెలలో బహిరంగంగానే ఆరోపణలు చేశారు. టెక్ దిగ్గజం వారి కృత్రిమ మేధ సాంకేతికతను ట్రెయిన్‌ చేయడానికి ట్విటర్‌ (Twitter) డేటాను అక్రమంగా ఉపయోగించుకుంటోందని ట్వీట్‌ చేశారు. తాజా ఆరోపణలపై మైక్రోసాఫ్ట్‌ స్పందించింది. ప్రస్తుతం తాము ట్విటర్‌ డేటాకు ఎలాంటి చెల్లింపులు చేయడం లేదని తెలిపింది. ట్విటర్‌ నుంచి తమకు లేఖ అందినట్లు మైక్రోసాఫ్ట్‌ అధికార ప్రతినిధి ఫ్రాంక్‌ షా ధ్రువీకరించారు. లేఖను క్షుణ్నంగా పరిశీలించి స్పందిస్తామని తెలిపారు. ట్విటర్‌తో దీర్ఘకాల భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు.

మస్క్‌, మైక్రోసాఫ్ట్‌ (Microsoft) మధ్య గతకొంతకాలంగా సంబంధాలు అంత సజావుగా ఏమీ లేవు. చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలున్నాయి. ఓపెన్‌ఏఐ స్థాపనలో మస్క్‌ కృషి కూడా ఉంది. అయితే, ఈ కంపెనీలో 13 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసిన మైక్రోసాఫ్ట్‌.. పూర్తిగా కార్యకలాపాలను నియంత్రిస్తోందని మస్క్‌ ఆరోపించారు. తదనంతర పరిణామాల్లో ఆయన ఓపెన్‌ఏఐ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని