Twitter: భారత్‌లో ట్విటర్ ‘బ్లూటిక్‌’ ఛార్జీలు ప్రారంభం.. నెలకు రూ.719

ట్విటర్‌ బ్లూటిక్‌ పెయిడ్ వెర్షన్‌ను భారత్‌లో అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ గురించి కొందరు యూజర్లకు మెసేజ్‌లు వస్తున్నాయి.

Updated : 11 Nov 2022 11:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న కొద్ది రోజుల్లోనే కీలక మార్పులు చేపట్టిన కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌.. బ్లూటిక్‌కు ఛార్జీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికా, యూకే సహా కొన్ని దేశాల్లో ఈ ఛార్జీలు అమల్లోకి రాగా.. తాజాగా భారత్‌లోనూ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బ్లూటిక్‌ ఛార్జీలపై కొందరు యూజర్లకు సందేశాలు వచ్చాయట. ఇంతకీ మరి భారత్‌లో ఈ సబ్‌స్క్రిషన్‌కు నెలకు ఎంతో తెలుసా..? రూ.719 అట.

అయితే ప్రస్తుతానికి ఐఓఎస్‌ (ఐఫోన్‌) యూజర్లకు మాత్రమే ఈ మెసేజ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అందరికీ ఈ ఛార్జీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ మెసేజ్‌లు వచ్చిన యూజర్లు కొందరు వాటిని స్క్రీన్‌షాట్లు తీసి ట్విటర్‌లో పోస్టు చేస్తున్నారు. అందులో నెలవారీ ఛార్జీ రూ.719గా కన్పించింది. బ్లూటిక్‌ కొనసాగించుకోవాలంటే ఖాతాదారులు ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వద్దనుకుంటే ఈ ఫీచర్‌ను రద్దు చేసుకోవచ్చు.

‘ట్విటర్‌ బ్లూ’ కోసం ఈ సబ్‌స్క్రిప్షన్‌ చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్‌ లేకుండానే బ్లూటిక్‌ వస్తుంది. దీంతో పాటు ఈ బ్లూటిక్‌ ఖాతాదారులకు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉండనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే వెల్లడించారు. అయితే ఇలా వెరిఫికేషన్ లేకుండా ఇవ్వడం వల్ల నకిలీ ఖాతాలు పెరిగే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొందరు ముఖ్య వ్యక్తులను గుర్తించేందుకు ‘అధికారిక’ గుర్తును ట్విటర్‌ తీసుకొచ్చింది. అయితే, ఈ గుర్తు చాలా మంది ప్రభుత్వేతర వ్యక్తుల ఖాతాల్లోనూ కనిపించడంతో గందరగోళం నెలకొంది. దీంతో కొన్ని గంటల్లోనే ‘అధికారిక’ గుర్తును వెనక్కి తీసుకుంటున్నట్లు ట్విటర్‌ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని