Twitter: ట్విటర్‌తో ముగిసిన జాక్‌ డోర్సే బంధం..!

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ (Twitter) సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్‌ డోర్సే (Jack Dorsey).. ఆ సంస్థతో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నారు. ట్విటర్‌ బోర్డు నుంచి డోర్సే వైదొలిగారు. బుధవారం

Updated : 26 May 2022 13:25 IST

బోర్డు నుంచి వైదొలిగిన సహ వ్యవస్థాపకుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ (Twitter) సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్‌ డోర్సే (Jack Dorsey).. ఆ సంస్థతో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నారు. ట్విటర్‌ బోర్డు నుంచి డోర్సే వైదొలిగారు. బుధవారం కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లుగా పదవీకాలం ముగిసిన కొందరిని తిరిగి ఎన్నుకునేందుకు ఎన్నికలు జరిగాయి. డోర్సే పదవీకాలం కూడా ముగిసినప్పటికీ.. ఆయన రీ ఎలక్షన్‌కు నిలబడలేదు. దీంతో ఆయన కంపెనీ నుంచి పూర్తిగా వైదొలిగినట్లయింది.

2006లో డోర్సే మరో ముగ్గురితో కలిసి ట్విటర్‌ (Twitter) ను స్థాపించారు. 2007 నుంచి డోర్సే (Jack Dorsey) కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు. 2015లో ట్విటర్‌ సీఈఓగా నియమితులయ్యారు. అయితే అనూహ్యంగా గతేడాది నవంబరులో సీఈఓ పదవికి రాజీనామా చేశారు. డైరెక్టర్‌గా పదవీకాలం ముగిసిన తర్వాత బోర్డు నుంచి కూడా వైదొలుగుతానని అప్పుడే ప్రకటించారు. అన్నట్లుగానే నేడు ఆయన బోర్డును వీడారు. డోర్సే (Jack Dorsey) వైదొలగడంతో.. ట్విటర్‌ బోర్డు చరిత్రలో తొలిసారిగా కంపెనీ వ్యవస్థాపకులెవరూ సంస్థలో పనిచేయడం గానీ, బోర్డు సభ్యులుగా గానీ లేకపోవడం గమనార్హం.

ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లను కొనుగోలు చేసేందుకు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇటీవల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్విటర్‌ (Twitter) పై మస్క్‌ అభిప్రాయాలను డోర్సే ఏకీభవిస్తూ వచ్చారు. దీంతో ఆయన తిరిగి కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ వార్తలను డోర్సే(Jack Dorsey) కొట్టిపారేశారు. తాను తిరిగి ట్విటర్‌కు వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఆయన.. కంపెనీ సీఈఓగా ఎవరూ బాధ్యతలు చేపట్టబోరని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు ట్విటర్‌ కొనుగోలుకు మస్క్‌(Elon Musk) చేసుకున్న ఒప్పందం ప్రస్తుతం నిలిచిపోయింది. ట్విటర్‌ (Twitter) లో నకిలీ ఖాతాల సంఖ్యపై సంస్థ స్పష్టత ఇస్తేనే ఈ ఒప్పందం ముందుకెళ్తుందని మస్క్‌ స్పష్టంగా చెప్పారు. దీంతో ఇప్పుడు కంపెనీ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని