Twitter: స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్ల కోసం ట్విటర్‌ కొత్త ఫీచర్‌!

మార్కెట్‌ ఒడిదొడుకుల గురించి సులువుగా తెలుసుకుంనేదుకు వీలుగా ఇన్వెస్టర్లు, ట్రేడర్లు, ఆర్థికరంగ నిపుణల కోసం ట్విటర్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో స్టాక్‌ల వివరాలతోపాటు ఈటీఎఫ్‌, క్రిప్టోకరెన్సీ సమాచారం కూడా తెలుసుకోవచ్చు. 

Updated : 23 Dec 2022 00:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటే మార్కెట్‌ తీరును నిత్యం గమనిస్తూ ఉండాలి. అవగాహన లేకుండా పెట్టుబడులు పెడితే నష్టాలు తప్పవు. అందుకే తొందరపడి పెట్టుబడులు పెట్టొద్దని నిపుణులు సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ ఒడిదొడుకుల గురించి సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ఇన్వెస్టర్లు, ట్రేడర్లు, ఆర్థికరంగ నిపుణులకోసం ట్విటర్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా చార్ట్‌లు, గ్రాఫ్‌లు, ప్రధాన స్టాక్‌ల వివరాలు, ఈటీఎఫ్‌, క్రిప్టోకరెన్సీల గురించిన సమాచారం ఒక్క ట్వీట్‌లో చూడొచ్చు. ఈ ఫీచర్‌ గురించిన వివరాలను ట్విటర్‌ బిజినెస్‌ ఖాతాలో వెల్లడించింది. 

ట్విటర్‌ యూజర్లు ఏదైనా స్టాక్‌ గురించిన వివరాలు తెలుసుకునేందుకు స్టాక్‌ పేరుకు ముందు డాలర్‌($) సింబల్‌ టైప్‌ చేసి ట్వీట్ చేయాలి. తర్వాత యూజర్లు సదరు ట్వీట్‌పై క్లిక్ చేస్తే వారికి స్టాక్‌ గురించిన పూర్తి సమాచారం కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ట్విటర్‌ బృందాన్ని మస్క్ అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఫీచర్‌ పూర్తిగా ఉచితం. యూజర్లందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. 

మస్క్‌ ట్విటర్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వ, బిజినెస్‌, వ్యక్తిగత ఖాతాలను వేర్వేరు లేబుల్స్‌, బ్యాడ్జ్‌లు ఇవ్వడం ప్రారంభించారు. అయితే, మస్క్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై విమర్శలు వ్యక్తం కావడంతో, ట్విటర్‌ సీఈవో కొనసాగాలా? వద్దా? అని పోల్‌ నిర్వహించారు. ఇందులో మస్క్‌ వ్యతిరేకంగా ఎక్కువమంది యూజర్లు ఓటేయడంతో, సీఈవో తాను వైదొలగనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మస్క్‌ ట్విటర్‌ కొత్త సీఈవో అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని