Elon Musk Vs Twitter: ఎలాన్ మస్క్కు ట్విటర్ ‘విషపు గుళిక’!
ట్విటర్ను సొంతం చేసుకోవాలనుకుంటున్న బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రయత్నాల్ని ఆ సంస్థ తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది....
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ (Twitter)ను సొంతం చేసుకోవాలనుకుంటున్న బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రయత్నాల్ని ఆ సంస్థ తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం దశాబ్దాలుగా వ్యాపారవర్గాలు అనుసరిస్తున్న ‘పాయిజన్ పిల్ (poison pill)’ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.
ప్రస్తుతం 9.2 శాతం వాటాలతో ట్విటర్లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుల్లో ఒకరిగా ఉన్న మస్క్ 43 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందాన్ని ఆఫర్ చేశారు. ఒకవేళ ట్విటర్ బోర్డు దీన్ని తిరస్కరిస్తే మస్క్ ‘హోస్టైల్ టేకోవర్ (Hostile Takeover)’ అంటే బోర్డు నిర్ణయంతో సంబంధం లేకుండా బలవంతపు కొనుగోలుకు యత్నించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అంటే మస్క్ నేరుగా షేర్హోల్డర్ల దగ్గరకు వెళ్లి ప్రీమియం ధరకు షేర్లు కొనుగోలు చేసి కంపెనీపై నియంత్రణను సాధించే అవకాశం ఉందని సమాచారం. దీన్ని నిలువరించడానికే ట్విటర్ తాజాగా పాయిజన్ పిల్ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
పాయిజన్ పిల్ ఏం చేస్తుంది?
1980వ దశకంలో పాయిజన్ పిల్ వ్యూహం బాగా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో కార్లా ఇకా వంటి బడా పెట్టుబడిదారులు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలను హస్తగతం చేసుకున్నారు. దీన్ని నిలువరించే ప్రయత్నంలో భాగంగానే పాయిజన్ పిల్ పుట్టుకొచ్చింది. అలాంటి పెట్టుబడిదారులనే ఇప్పుడు ‘యాక్టివిస్ట్ ఇన్వెస్టర్స్ (activist investors)గా కార్పొరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పాయిజన్ పిల్ను అధికారికంగా ‘షేర్హోల్డర్స్ రైట్స్ ప్లాన్’ అని అంటుంటారు. ఇది కంపెనీ ‘ఛార్టర్’ లేదా ‘బైలాస్’ లేదా వాటాదారుల ఒప్పందాల్లో భాగంగా ఉంటుంది. అయితే, ఈ పాయిజన్ పిల్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఓ వ్యూహంలో భాగంగా భారీ ఎత్తున కొత్త షేర్లను సృష్టించి కార్పొరేట్ బోర్డులు మార్కెట్లోకి వదులుతాయి. దీంతో కంపెనీని ఏకపక్షంగా, బలవంతంగా కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది ప్రతికూలంగా మారుతుంది. అప్పుడు ఆ కంపెనీని కొనడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారి వారు తోకముడిచే అవకాశం ఉంటుంది.
మరో వ్యూహాన్ని పరిశీలిస్తే.. రాయితీ ధర వద్ద తమ వాటాను పెంచుకునేందుకు కొంతమంది షేర్హోల్డర్లకు బోర్డు అనుమతిస్తుంది. ఎవరైతే బలవంతంగా కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారిని మాత్రం దీని నుంచి దూరంగా ఉంచుతుంది. సాధారణంగా దీనికి ఒక నియమం పెడుతుంటారు. కంపెనీలో ఎవరి వాటానైనా ఒక నిర్దిష్ట స్థాయిని దాటితే, ఆ అదనపు వాటాలను రాయితీ ధర వద్ద ఇతర వాటాదారులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఫలితంగా వారి షేర్ల ధర తగ్గడంతో పాటు వాటా కూడా కిందకు వస్తుంది. ముఖ్యంగా కొనుగోలుకు యత్నిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని దీన్ని అమలు చేస్తారు. దీంతో చాలా మంది ఆ నిర్దిస్ట స్థాయిని దాటడానికి సాహసించరు.
తాము అనుసరించబోతున్న పాయిజన్ పిల్ వ్యూహం ఏంటో మాత్రం ట్విటర్ వెల్లడించలేదు. శుక్రవారం స్టాక్ మార్కెట్లు ముగిసిన నేపథ్యంలో తదుపరి ఎక్స్ఛేంజీ ఫైలింగ్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. కంపెనీ వాటాదార్లలో ఎవరి వాటానైనా 15 శాతం మించితే.. వీరి వ్యూహం అమల్లోకి వస్తుందని సమాచారం. ప్రస్తుతం ఎలాన్ మస్క్కు 9.2 శాతం వాటాలున్నాయి.
బేరసారాలకూ ఇదొక అవకాశం
సాధారణంగా బలవంతపు కొనుగోళ్లను నిలువరించడానికే పాయిజన్ పిల్ వ్యూహాన్ని అనుసరిస్తారు. అయితే, కొన్నిసార్లు మరింత మెరుగైన ఒప్పందం కోసం అంటే ఎక్కువ డబ్బును డిమాండ్ చేయడానికి కూడా దీన్ని ఒక సాధనంగా వాడుకుంటారు. కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తి లేదా సంస్థ ఇచ్చిన ఆఫర్ నచ్చకపోతే పాయిజన్ పిల్ అమలుకు సిద్ధమవుతారు. అప్పుడు సదరు ఇన్వెస్టర్ ముందుకు వచ్చి కంపెనీ బోర్డుతో చర్చించి మరింత ఎక్కువ ధరను ఆఫర్ చేసే అవకాశం ఉంది.
కానీ, ట్విటర్ మాత్రం ఈ దారిలో వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ ఎలాన్ మస్క్ ఎక్కువ ధర ఆఫర్ చేసినా కంపెనీని వదులుకోవడానికి సిద్ధంగా లేమని ట్విటర్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చింది.
పాయిజన్ పిల్ అమలు ఒక్కోసారి న్యాయపరమైన చిక్కులకూ దారితీస్తుంది. వాటాదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తోందంటూ ఇన్వెస్టర్లు కోర్టుకు వెళ్లిన సందర్భాలున్నాయి. మరికొన్నిసార్లు మంచి ఆఫర్ను వినియోగించుకునేందుకు బోర్డు తమని అనుమతించడం లేదంటూ వాటాదారులూ కోర్టుకు వెళ్లారు.
ఎలాన్ మస్క్ ఏమంటున్నారు?
ట్విటర్ కొత్త వ్యూహంపై మస్క్ ఇంకా స్పందించలేదు. అయితే, తాను న్యాయపోరాటానికి సిద్ధమవుతానని మాత్రం గురువారం ఓ సంకేతం ఇచ్చారు.‘‘ఒకవేళ ప్రస్తుత ట్విటర్ బోర్డు వాటాదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే.. వారు వారి ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని ఉల్లంఘిస్తున్నట్లే అవుతుంది. దానికి వారు వహించాల్సిన బాధ్యత భారీగానే ఉంటుంది’’ అని మస్క్ గురువారం ట్వీట్ చేశారు. తన నుంచి వచ్చిన 43 బిలియన్ డాలర్ల ఆఫర్ అత్యుత్తమైనదని.. ఇదే చివరిదని మస్క్ తెలిపారు.
గతంలో పాయిజన్ పిల్ పనిచేసిందా?
కొనుగోలును మరింత కష్టతరంగా మార్చే ఇలాంటి వ్యూహాలు కొన్నిసార్లు సత్ఫలితాలిస్తే మరికొన్నిసార్లు విఫలమయ్యాయి. 2003లో సాఫ్ట్వేర్ తయారీ సంస్థ పీపుల్సాఫ్ట్ను కొనుగోలు చేసేందుకు ఒరాకిల్ 5.1 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇచ్చింది. దీన్ని పీపుల్సాఫ్ట్ వ్యతిరేకించడంతో ఇరు సంస్థల మధ్య 18 నెలల సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది. దీన్ని నిలువరించేందుకు పీపుల్సాఫ్ట్ పాయిజన్ పిల్ వ్యూహాన్ని అనుసరించి అనేక షేర్లను సృష్టించి మార్కెట్లోకి వదిలింది. అలాగే ‘కస్టమర్ అష్యూరెన్స్ ప్రోగ్రాం’ పేరిట మరో కొత్త వ్యూహాన్నీ తెరపైకి తెచ్చారు. దీని ప్రకారం.. ఒకవేళ తదుపరి రెండు సంవత్సరాల్లో పీపుల్సాఫ్ట్ ఇతర సంస్థల చేతుల్లోకి వెళితే.. తమ కస్టమర్లందరికీ సాఫ్ట్వేర్ లైసెన్సులకు చెల్లిస్తున్న మొత్తానికి ఐదింతలు తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించింది. అంటే కొనుగోలు చేయబోయే సంస్థకు అనవసరంగా 800 మిలియన్ డాలర్ల అప్పును మిగల్చడం అని అర్థం. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా ఒరాకిల్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కోర్టులో దావా వేసింది. తీర్పు మాత్రం వ్యతిరేకంగా రావడం గమనార్హం. చివరకు పీపుల్సాఫ్ట్ను ఒరాకిల్ సొంతం చేసుకుంది. కానీ, పీపుల్సాఫ్ట్ పోరాటం మాత్రం వృథా కాలేదు. తొలుత 5.1 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసిన ఒరాకిల్ చివరకు 11.1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. ఇది పీపుల్సాఫ్ట్ వాటాదారులకు భారీ రాబడిని తెచ్చిపెట్టింది.
మరో సందర్భంలో నెట్ఫ్లిక్స్లో నియంత్రణాధికారాల కోసం కార్లా ఇకా చేసిన ప్రయత్నానికి ఆ కంపెనీ పాయిజన్ పిల్ వ్యూహంతో విజయవంతంగా అడ్డుకట్ట వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి