Twitter: ట్విటర్‌ 2.0లో పేమెంట్స్‌, ట్వీట్‌లో 420 అక్షరాలు.. మస్క్‌ కొత్త ఆలోచన!

ట్విటర్‌లో యూజర్లు సరికొత్త ఫీచర్లను పరిచయం చేయనున్నారు. దీనిపై ట్విటర్‌ కొత్త బాస్‌ మస్క్‌ సైతం సానుకూలంగా స్పందించాడు. ఇంతకీ ఆ ఫీచర్లేంటి? వాటితో యూజర్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయో చూద్దాం. 

Published : 28 Nov 2022 17:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్ యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఓ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ట్వీట్‌లో అక్షరాల పరిమితిని 280 నుంచి 420కి పెంచునున్నట్లు సమాచారం. దీనిపై ట్విటర్‌ కొత్త బాస్‌ మస్క్‌ సైతం సానుకూలంగా స్పందించాడు. ఓ నెటిజన్‌ ‘‘ట్విటర్‌ 2.0లో అక్షరాల పరిమితిని 280 నుంచి 420గా మారుస్తారా?’’ అనిట్వీట్‌ చేయగా, ‘మంచి ఆలోచన’ అంటూ మస్క్‌ సానుకూలంగా బదులు ఇవ్వడంతో నెటిజన్లు దీనిపై చర్చించుకుంటున్నారు. 

నోట్స్‌ ఫీచరేనా!

గతంలో ఒక ట్వీట్‌లో 140 పదాలకు మించి టైప్‌ చేయడం సాధ్యపడేదికాదు. 2018లో ఈ సంఖ్యను 280కి పెంచారు. తాజాగా దీన్ని 420కి పెంచుతారని నెట్టింట్లో చర్చ మొదలైంది. మస్క్‌ ట్విటర్‌కు సంబంధించి కొత్తగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పోల్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్వీట్‌లో అక్షరాల పరిమితి పెంచాలా? వద్దా? అనేది నిర్ణయించేందుకు ఆయన పోల్ నిర్వహించవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేయడానికి ముందు నోట్స్‌/ఆర్టికల్స్‌ అనే పీచర్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. వీటిలో యూజర్లు బ్లాగ్ తరహాలో తాము చెప్పాలనుకున్న కంటెంట్‌ను ఒకేదాంట్లో రాసేందుకు వీలుంటుంది. ఇందులో గరిష్ఠంగా 2500 అక్షరాల వరకు రాసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ గురించి తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ లేదు. మస్క్‌, తాజా స్పందనతో వీటిలో ఒక ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందని నెటిజన్లు ఆశిస్తున్నారు. 

2.0 షురూ..

ట్విటర్‌ నుంచి దశలావారీగా ఐదువేల మంది ఉద్యోగులను తొలగించిన మస్క్‌, కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ట్విటర్‌ 2.0 కోసం కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించాడు.  మస్క్‌ నిర్ణయాలతో విభేదించి కొంతమంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీంతో ట్విటర్‌కు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోడింగ్‌ అనుభవం ఉన్న ఉద్యోగులు ఎవరైనా తన కొత్త టీమ్‌లో చేరొచ్చని మస్క్‌ ఆహ్వానించాడు. మరోవైపు, ట్విటర్‌ను పునర్నిర్మించేందుకు ప్రపంచంలోనే పేరున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపాడు. 

మస్క్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్విటర్‌లో ద్వేషపూరిత మెసేజ్‌ల వ్యాప్తి తగ్గముఖ్యం పట్టడంతోపాటు, కొత్తగా ట్విటర్‌ ఖాతాలు తెరిచే వారి సంఖ్య గతంలో కంటే పెరిగిందని ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ట్విటర్‌ 2.0లో ఎక్కువగా వీడియోలు, ప్రకటనలు, ఎంటర్‌టైన్‌మెంట్‌పై దృష్టి సారించనున్నట్లు తెలిపాడు. ఇందులోభాగంగా ట్విటర్‌లో ఎన్‌క్రిప్టెడ్‌ డిస్‌ప్లే మెసేజ్‌, పేమెంట్స్‌, పెద్ద ట్వీట్లు వంటి ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారట.  వీటితోపాటు డిసెంబరు 2 నుంచి బ్లూ వెరిఫికేషన్  పునఃప్రారంభించనున్నట్లు తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని