Twitter: మూడో వంతుకు తగ్గిన ట్విటర్‌ విలువ: ఫిడెలిటీ

Twitter: ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ గత ఏడాది 44 బిలియన్‌ డాలర్లకు కొన్నారు. అయితే, దాని విలువ ఇప్పుడు మూడో వంతుకు తగ్గినట్లు ప్రముఖ ఆర్థిక సంస్థ ఫిడెలిటీ తెలిపింది.

Published : 31 May 2023 13:43 IST

వాషింగ్టన్‌: గత ఏడాది కార్పొరేట్‌ ప్రపంచంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశాల్లో ట్విటర్‌ (Twitter) కొనుగోలు ఒకటి. బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఈ కంపెనీని 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్నారు. కానీ, దాని విలువ ఇప్పుడు కొన్న మొత్తంలో మూడో వంతుకు పడిపోయినట్లు ప్రముఖ ఆర్థిక సంస్థ ఫిడెలిటీ తెలిపింది. ఈ ఫిడెలిటీకి స్వయంగా ట్విటర్‌ (Twitter)లో ఈక్విటీ వాటాలున్నాయి.

ట్విటర్‌ (Twitter)ను తాను చాలా ఎక్కువ ధర పెట్టి కొన్నానని స్వయంగా ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) గతంలో అన్నారు. ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ట్విటర్‌ (Twitter) విలువ తాను కొన్న మొత్తంలో సగం కూడా ఉండదని బాహాటంగానే చెప్పారు. తాజాగా ఫిడెలిటీ అదే చెప్పింది. అయితే, ట్విటర్‌ విలువను ఎలా లెక్కగట్టారనే విషయాన్ని మాత్రం ఫిడెలిటీ వెల్లడించలేదు.

ఫిడెలిటీ తొలుత ట్విటర్‌ (Twitter)లోని తమ వాటాల విలువను కొన్న ధరతో పోలిస్తే గత నవంబరులో 44 శాతానికి తగ్గించింది. డిసెంబరు, ఫిబ్రవరిలో వాటాల విలువ మరింత తగ్గినట్లు తెలిపింది. మస్క్‌ (Elon Musk) ట్విటర్‌ను కొనుగోలు చేసే నాటికే కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. మస్క్‌ చేతికి వచ్చిన తర్వాత అవి మరింత ఎక్కువయ్యాయి. ట్విటర్‌లో ఆయన చేసిన మార్పుల నేపథ్యంలో కొన్ని కంపెనీలు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ఆపేశాయి. దీంతో అడ్వర్‌టైజ్‌మెంట్‌ల ద్వారా వచ్చే ఆదాయం 50 శాతానికి పడిపోయిందని మస్క్‌ స్వయంగా అప్పట్లో ప్రకటించారు.

తగ్గిన ఆదాయాన్ని పూడ్చుకోవడం కోసం ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ట్విటర్‌లో అనేక మార్పులు చేశారు. బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చారు. కానీ, ఇప్పటి వరకు అవేవీ పెద్దగా ఫలితాలిచ్చినట్లు కనిపించడం లేదని కార్పొరేట్‌ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ విలువ భారీగా పడిపోయినట్లు ఫిడెలిటీ తెలిపింది. ట్విటర్‌ (Twitter) కొనుగోలు కోసం మస్క్‌ స్వయంగా 25 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఆ పెట్టుబడి విలువ ఇప్పుడు 8.8 బిలియన్‌ డాలర్లకు తగ్గినట్లు ఫిడెలిటీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని