Adani Group: ఆఖరు నిమిషంలో అదానీని ఆదుకున్న ఇద్దరు వ్యాపారులు!

అదానీ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ ఎఫ్‌పీఓకు అనూహ్య స్పందన రావడం వెనుక ఇద్దరు భారత వ్యాపార దిగ్గజాలు, యూఏఈకి చెందిన ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఉన్నట్లు సమాచారం. వారు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను ఎఫ్‌పీఓను గట్టెక్కించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది. 

Published : 02 Feb 2023 01:18 IST

ముంబయి: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికతో గత కొద్దిరోజులు అదానీ కంపెనీ (Adani Group) షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ₹ 20,000 కోట్ల సమీకరణ నిమిత్తం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) ప్రారంభించిన ఫాలో ఆన్‌ పబ్లిక్ ఆఫర్‌ (FPO) నుంచి గట్టెక్కుతుందా లేదా అనే అనుమాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రచారానికి భిన్నంగా మంగళవారం ఎఫ్‌పీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయింది. కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ అదానీ ఎఫ్‌పీఓకు సానుకూల స్పందన రావడం వెనుక ఇద్దరు భారత వ్యాపార దిగ్గజాలు ఉన్నట్లు సమాచారం. ఆ ఇద్దరు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను ఎఫ్‌పీఓ గండం నుంచి గట్టెక్కించినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో వారు అదానీ షేర్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది. వారెవరో కాదు.. భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) ఛైర్మన్ సునీల్‌ మిత్తల్‌ (Sunil Mittal), జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ (JSW Group) ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ (Sajjan Jindal). 

ఈ ఇద్దరు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓ పూర్తి చేసేందుకు సాయపడ్డారని మార్కెట్‌ వర్గాలు సైతం చెబుతున్నాయి. అయితే, ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయకూడదని వారు కోరినట్లు సమాచారం. జిందాల్‌ 30 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు సబ్‌స్రైబ్‌ చేసుకోగా, మిత్తల్‌ ఎంత మొత్తానికి సబ్‌స్క్రైబ్‌ చేశారనేది దానిపై సమాచారం వెలుగులోకి రాలేదు. అయితే, వీరు తమ వ్యక్తిగత సంపద నుంచి ఈ పెట్టుబడులు పెట్టినట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. వీరితోపాటు అబుదాబి రాజకుటుంబానికి చెందిన ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ కంపెనీ (IHC) సైతం 400 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఎఫ్‌పీఓ పెట్టుబడుల్లో ఇదే అతి పెద్ద మొత్తం. 

ఎఫ్‌పీఓ కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ మొత్తం 4.55 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచగా.. 4.62 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ‘సంస్థాగతేతర మదుపర్ల ( Non-institutional investors)’కు 96.16 లక్షల షేర్లు రిజర్వు చేయగా.. ఈ విభాగంలో మూడు రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. మరోవైపు ‘అర్హతగల సంస్థాగత మదుపర్ల (Qualified institutional buyers)’ విభాగంలోని స్టాక్స్‌ పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. అయితే, రిటైల్‌ మదుపర్లు, కంపెనీ ఉద్యోగుల నుంచి మాత్రం పెద్దగా స్పందన లభించలేదు. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం 2.29 కోట్ల షేర్లను కేటాయించగా.. కేవలం 11 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. ఉద్యోగులు తమకు కేటాయించిన 1.6 లక్షల షేర్లలో 52 శాతం షేర్లకు బిడ్లు దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని