Taxi services: త్వరలో ప్రభుత్వ అధికారులకు ఉబర్‌ సేవలు!

Taxi services: త్వరలో ఉబర్‌ సేవలు ప్రభుత్వ అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో ట్యాక్సీ సేవలకు అత్యధిక డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఖర్చుని తగ్గించుకోవడం కోసం ప్రభుత్వం ఉబర్‌తో భాగస్వామ్య కుదుర్చుకొన్నట్లు తెలుస్తోంది.

Published : 29 May 2023 01:27 IST

దిల్లీ: క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబర్‌ (Uber) సేవలను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో వివిధ మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉబర్ ట్యాక్సీలను (taxi services) బుక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్‌ పోర్టల్‌ (GeM), ఉబర్‌ మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరినట్లు ఓ అధికారి తెలిపారు. దీన్ని ఉబర్‌ (Uber) కంపెనీకి చెందిన ఒక ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.

ప్రస్తుతం ఈ సేవలు పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైనట్లు సదరు అధికారి తెలిపారు. త్వరలోనే వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అందుబాటులోకి వస్తాయన్నారు. దశలవారీగా దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. స్థిర ధరల వద్ద ఉబర్‌ (Uber) ఈ సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. క్యాన్సిలేషన్‌ ఛార్జీలు, ‘సర్జ్‌ ప్రైసింగ్‌’ ఉండవని తెలిపారు. జీఈఎం (GeM) పోర్టల్‌లో ఉబర్‌ ఇప్పటికే నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ వస్తువులు, సేవలను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం 2016లో జీఈఎంను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్‌లో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చింది.

వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ట్యాక్సీ సేవల (taxi services) కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. ఉబర్‌ (Uber)తో భాగస్వామ్యం వల్ల అవి తగ్గుతాయని ప్రభుత్వం యోచిస్తోంది. జీఈఎం (GeM)లో క్యాబ్‌, ట్యాక్సీ సేవలకే అత్యధిక డిమాండ్‌ ఉంది. ఉబర్‌ (Uber) యాప్‌ ద్వారా సేవలను బుక్‌ చేసుకునే అధికారులను ఎంపిక చేసేందుకు ప్రతి విభాగంలో ఒకరిని ఎంపిక చేయనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. కొత్త వారిని చేర్చడం, ఉన్నవారిని తొలగించేందుకు వారికే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

క్యాబ్‌లో ప్రయాణించిన వారు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారి తెలిపారు. నేరుగా బిల్లులు సదరు ప్రభుత్వ విభాగానికి వెళతాయని పేర్కొన్నారు. మరోవైపు ఉబర్‌ (Uber) యాప్‌లో జీఈఎం యాత్ర హేచ్‌, జీఈఎం యాత్ర సెడాన్‌ విభాగాలను చేర్చినట్లు తెలిపారు. పలుచోట్ల ఆపాల్సిన అవసరం ఉన్నప్పుడు గంటల లెక్కన ట్యాక్సీని బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని