Aadhaar: జననానికీ, మరణానికీ ఆధార్‌‌.. మరో రెండు పైలట్‌ ప్రాజెక్టులకు ఉడాయ్‌ ప్లాన్‌!

ఆధార్‌ పరిధిని మరింత విస్తరించాలని భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) యోచిస్తోంది. పుట్టిన వారితో పాటు, మరణించిన వారి వివరాలనూ ఆధార్‌కు లింక్‌ చేయాలని భావిస్తోంది.

Updated : 15 Jun 2022 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి వ్యక్తి జీవితంలో ఆధార్‌ (Aadhaar) భాగమైపోయింది. ఆధార్‌ వెంట లేనిదే ఏ పనీ కావడం లేదు. దేశంలోని సుమారు 130 కోట్ల మందికి వేర్వేరుగా కేటాయించిన 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ (Aadhaar) పరిధిని మరింత విస్తరించాలని భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) యోచిస్తోంది. పుట్టిన వారితో పాటు, మరణించిన వారి వివరాలనూ ఆధార్‌కు లింక్‌ చేయాలని భావిస్తోంది. త్వరలోనే ఈ రెండు పైలట్‌ ప్రాజెక్టులు ప్రారంభించనున్నామని ఉడాయ్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించినట్లు ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ తన కథనంలో పేర్కొంది.

ఈ పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా నవజాత శిశువులకు బయోమెట్రిక్‌ వివరాలు తీసుకుని ఆ మేరకు శాశ్వత ఆధార్‌ కార్డు (Aadhaar Card)ను జారీ చేయనున్నారు. ఇంటి వద్దకే వెళ్లి ఈ వివరాలు నమోదు చేయనున్నారని అధికారి వెల్లడించారు. 18 ఏళ్ల తర్వాత మరోసారి బయోమెట్రిక్‌ వివరాలు రీ రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీనివల్ల బహుళ ఐడీలను జనరేట్‌ చేయాల్సిన అవసరం ఉండదని.. పైగా చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ పథకాల నుంచి దూరం కాలేరని సదరు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఐదేళ్ల లోపు చిన్నారుల ఆధార్‌ వివరాలు సేకరిస్తున్నప్పటికీ.. వారి బయోమెట్రిక్‌ వివరాలు తీసుకోవడం లేదు. దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో తక్కువ సంఖ్యలో మాత్రమే ఆధార్‌ నమోదు చేసుకుంటున్న నేపథ్యంలో ఉడాయ్‌ ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది.

మరోవైపు భారత పౌరుడిగా ఆధార్‌ తీసుకుంటున్నప్పటికీ ఎవరైనా చనిపోతే ఆ వివరాలు ఉడాయ్‌ వద్ద నమోదు కావడం లేదు. దీంతో ఇప్పటికీ ఆధార్‌ నంబర్‌ కలిగిన వ్యక్తి పేరుతో పెన్షన్‌ అందుకుంటున్నారని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కొవిడ్‌ సమయంలో చాలా మంది మరణించినా వారి వివరాలేవీ ఉడాయ్‌ దగ్గర లేవు. ఈ నేపథ్యంలో పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణాల వివరాలను తీసుకోనున్నారు. దీని ద్వారా ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టకుండా ఉంఉందని అధికారులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని