డేటా అయిపోతుందని సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయడం లేదా? ఈ నష్టాల గురించి తెలుసా?

Software update: మొబైల్‌ ఫోన్‌కు ఎప్పటికప్పుడు వచ్చే కొత్త సాప్ట్‌వేర్‌కి అప్‌డేట్‌ చేస్తున్నారా? ఒకవేళ చేయకపోతే కలిగే నష్టాలేంటో తెలుసుకోండి..

Updated : 15 Mar 2023 10:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌.. ఇప్పుడిది అందరి జీవితంలోనూ భాగమైపోయింది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేంత వరకు చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఎక్కువ సమయం ఇందులోనే గడిపేస్తున్నారు. ఇలా తరచూ వాడే ఫోన్లలో ఛార్జింగ్‌ ఉందా? డేటా సరిపోతుందా? అని చెక్‌ చేసుకుంటారే తప్ప.. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ (Software update) చేయాలని మాత్రం మనలో చాలామంది అనుకోరు. ఒకవేళ ‘అప్‌డేట్‌ యువర్‌ డివైజ్‌’ అని వచ్చినా.. ‘తర్వాత చూసుకుందాంలే’ అని పక్కన పెట్టేస్తుంటారు. మరికొందరైతే ‘ఇప్పుడు అప్‌డేట్‌ చేస్తే డేటా అంతా తినేస్తుంది. పడుకొనే ముందు మిగిలిపోయిన డేటాతో అప్‌డేట్‌ చేద్దాంలే’ అనుకునే వారే మనలో ఎక్కువ. అయినా అప్‌డేట్‌ చేయనంత మాత్రాన నష్టం ఏముంది అనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు  తెలుసుకోవాల్సిందే..!

కొత్త ఫీచర్లు కోల్పోతాం: రోజులు మారుతున్న కొద్దీ సాంకేతికతలో మార్పులు సహజం. అలాగే మన మొబైల్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటాయి. అలాగే పాత వాటిలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసి మెరుగులు దిద్దుతుంటాయి. ఇందులో కొన్ని సెక్యూరిటీకి సంబంధించినవీ ఉంటాయి. ఈ కొత్త ఫీచర్లు అందుకోవాలీ అంటే మనకొచ్చే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి.

ఫోన్ వేగం తగ్గొచ్చు: చాలా వరకు ఫోన్‌ తయారీ కంపెనీలు తరచూ సాప్ట్‌వేర్‌ అప్‌డేట్లను ఇస్తుంటాయి. ఇవి మొబైల్‌ పనితీరు మొరుగవ్వటానికి, ఫోన్‌ ఎక్కువ కాలం పనిచేయటానికి ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు మన ఫోన్‌ వేగం తగ్గడం గమనిస్తూ ఉంటాం. సాప్ట్‌వేర్‌ అప్‌డేట్‌ వచ్చినప్పుడు అప్‌డేట్‌ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది.

బ్యాటరీ లైఫ్‌ మెరుగు: మొబైల్‌ కంపెనీలు విడుదల చేసే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌లో కెమెరా పనితీరును మరింత మెరుగుపరచటంతో పాటు బ్యాటరీ లైఫ్‌నూ పెంచే అప్‌డేట్స్‌ ఉంటాయి. బ్యాటరీపై ఒత్తిడిని తగ్గించేందుకు మొబైల్‌ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను ఇస్తుంటాయి. ఒకవేళ అప్‌డేట్‌ చేసుకోకపోతే బ్యాటరీ పనితీరుపై ప్రభావం పడి దాని జీవితకాలం తగ్గుతుంది.

సైబర్‌ దాడుల నుంచి రక్షణ: సెక్యూరిటీ అప్‌డేట్‌ అనేది మన ఫోన్‌పై జరిగే హానికరమైన దాడుల నుంచి రక్షణ కల్పించడానికి సాయపడుతుంది. మన ఫోన్లలో ఉండే బగ్స్‌ కారణంగా ఒక్కోసారి సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన స్మార్ట్‌ఫోన్‌ అప్‌డేట్‌గా లేకపోతే సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ను మన ఫోన్‌లో జొప్పించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు మొబైల్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇస్తుంటాయి. దీనివల్ల ఇంటర్‌ఫేస్‌లో మార్పులు ఉండవు. కాబట్టి పదే పదే అప్‌డేట్‌లు వస్తున్నాయి కదా అని విసుక్కోకుండా అప్‌డేట్‌ చేసుకోవడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని