Apple: భారత్‌ మార్కెట్‌పై ఆశతో ఉన్నాం: యాపిల్‌ సీఈఓ

భారత మార్కెట్‌పై తాము ప్రధానంగా దృష్టి సారించామని యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ తెలిపారు. ఇక్కడ తమ కంపెనీ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతోందన్నారు.

Published : 03 Feb 2023 15:14 IST

న్యూయార్క్‌: యాపిల్‌ (Apple) సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) తాను భారతదేశ మార్కెట్‌పై  సానుకూల దృక్పథంతో ఉన్నామని చెప్పారు. మన దేశ విపణిని ఆయన ‘‘ఉత్తేజకరమైన మార్కెట్‌’’గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులు, రిటైల్‌, ఆన్‌లైన్‌ మార్గాల్లో భారత్‌పై దృష్టి సారించామని తెలిపారు.

డిసెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను యాపిల్‌ (Apple) గురువారం  ప్రకటించింది. 117.2 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ నివేదించింది. కెనడా, ఇండోనేసియా, మెక్సికో, స్పెయిన్‌, టర్కీ, వియత్నాం, బ్రెజిల్‌, భారత్‌లో రికార్డు స్థాయి రెవెన్యూను నమోదు చేసింది. అయితే, 2021 డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఈసారి ఐదు శాతం తగ్గింది. సవాళ్లతో కూడిన మార్కెట్‌ పరిస్థితుల వల్లే ఇలా జరిగినట్లు వివరించింది. 

భారత్‌లోనూ రికార్డు స్థాయిలో త్రైమాసిక రెవెన్యూ నమోదైనట్లు టిమ్‌ కుక్‌ (Tim Cook) వెల్లడించారు. వార్షిక ప్రాతిపదికన రెండంకెల వృద్ధి నమోదవుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్‌పై ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. 2020లోనే ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభించామని గుర్తుచేశారు. త్వరలోనే యాపిల్‌ రిటైల్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు. మరోవైపు యాపిల్‌ ఉత్పత్తులను అందుబాటులో ధరలో అందించేందుకూ భారత్‌లో అనేక చర్యలు చేపడుతున్నామన్నారు.

డిసెంబరు త్రైమాసికంలో ఐఫోన్‌ విక్రయాల ద్వారా 65.8 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ సమకూరినట్లు యాపిల్‌ సీఎఫ్‌ఓ ల్యూకా మైస్ట్రీ తెలిపారు. విదేశీ మారక విలువల్లో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ మెరుగైన ఫలితాలే వచ్చాయన్నారు. ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తిన విషయాన్ని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని