WhastApp: 47 లక్షల భారతీయ వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం!

వాట్సాప్‌ (WhatsApp)లో కృత్రిమ మేధ (AI), డేటా సైంటిస్ట్‌లు, సాంకేతిక విభాగం అందించిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్నాం. మిగిలిన ఖాతాలపై యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

Published : 02 May 2023 00:16 IST

దిల్లీ: మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ (WhastApp) మార్చి నెలలో 47 లక్షల భారతీయ ఖాతాలపై నిషేధం విధించినట్లు తెలిపింది. తాజాగా విడుదల చేసిన యూజర్‌ సేఫ్టీ రిపోర్ట్‌ (User Safety Report)లో ఈ విషయాలను వెల్లడించింది. నిషేధానికి గురైన ఖాతాలన్నీ భారతీయ ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నట్లు గుర్తించామని తెలిపింది. ‘‘మార్చి 1 నుంచి మార్చి 31 మధ్య 47,15,906 ఖాతాలపై నిషేధం విధించాం. వీటిలో 16,59,385 ఖాతాలపై వాట్సాప్‌లో కృత్రిమ మేధ (AI), డేటా సైంటిస్ట్‌లు, సాంకేతిక విభాగం అందించిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్నాం. మిగిలిన ఖాతాలపై యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపట్టాం’’ అని వాట్సాప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

వాట్సాప్ సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం 4,720 ఖాతాలపై ఫిర్యాదులు రాగా, 4,316 ఖాతాలను నిషేధించాలని కోరగా.. పరిశీలన అనంతరం కేవలం 533 ఖాతాలపై మాత్రమే చర్యలు చేపట్టినట్లు తెలిపింది. అయితే, కొన్ని యూజర్ల ఖాతాలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ.. వాటికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని తెలిపింది. దీంతో సదరు ఖాతాలపై చర్యలు తీసుకోలేదని వెల్లడించింది.

అదేవిధంగా వాట్సాప్‌ ద్వారా అసభ్యకర సమాచారం వ్యాప్తి చెందకుండా ఏఐ సాయంతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ‘‘కొన్నేళ్లుగా యూజర్ల భద్రత కోసం ఏఐ, ఆధునిక సాంకేతికత, డేటా సైంటిస్ట్‌లు, నిపుణులు గురించి ఎంతో ఖర్చు చేస్తున్నాం. ఐటీ చట్టం 2021లోని నిబంధన ప్రకారం మా నెలవారీ సేఫ్టీ రిపోర్ట్‌ను వెల్లడించాం. ఇందులో యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులు, ఖాతాలపై నిషేధం తదితర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది’’ అని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని