Budget 2023: హైటెక్‌ వ్యవసాయం దిశగా బడ్జెట్‌లో అడుగులు..!

భారత్‌లో వ్యవసాయం ఇంకా పాత పద్ధతుల్లోనే చేస్తున్నారు. ఫలితంగా దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. దీనికి తోడు ఉత్పత్తులను కాపాడుకోలేక అన్నదాతలు మరింత నష్టపోతున్నారు. 

Updated : 30 Jan 2023 12:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో ఉపాధి కల్పించే రంగాల్లో వ్యవసాయానిది అగ్రస్థానం. దేశంలో 42 శాతం మంది దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ సర్కారు హామీ కరోనా, ఆర్థిక సంక్షోభాల కారణంగా పూర్తి కాలేదు. అసలే ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగాల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ  సమయంలో దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగంపై దీని ప్రభావం పడకుండా చూసుకోవడం కేంద్రానికి సవాలుగా మారనుంది. దీనికి తోడు వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞానాన్ని చొప్పించడం కూడా చాలా కీలకం. అప్పుడే ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరిగి.. అన్నదాత ఆదాయాన్ని కళ్లజూస్తాడు. ఎన్నికల ముందు బడ్జెట్‌ కావడంతో నీటిపారుదల రంగానికి కేటాయింపులు, నాణ్యమైన విత్తనాలు, టెక్నాలజీ వంటివి ఆర్థిక మంత్రికి కీలకం కానున్నాయి.

ప్రతికూల పరిస్థితులు..

వ్యవసాయ, పశుపోషణ రంగానికి కీలకమైన డీజిల్‌, విద్యుత్తు, పశువుల దాణా, మేత ఖర్చులు విపరీతంగా పెరిగాయి. వ్యవసాయ రంగంలో ద్రవ్యోల్బణం గత 20 నెలల్లో రెండంకెల్లో నమోదవుతోంది. డిసెంబర్‌ 2022 నాటికి అది 20.3 శాతానికి చేరింది. అదే జూన్‌లో ఇది 38.5శాతంగా ఉండి అన్నదాతను వణికించింది.

•  విపరీత వాతావరణ పరిస్థితులు పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపించాయి. భారీ ఉష్ణోగ్రతలు గోధుమ పంటను దెబ్బతీశాయి. దీనికి తోడు రుతు పవనాలు మెల్లగా కదలడం ఖరీఫ్‌ సీజన్‌ను ఇబ్బంది పెట్టాయి.

ఆధునికీకరణతోనే అత్యవసర చికిత్స..

భారత్‌లో వ్యవసాయం సంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతోంది. దీనికి భిన్నంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. దీంతో వాటి ఉత్పత్తుల నాణ్యత కూడా మెరుగు పడుతోంది. ఈ నేపథ్యంలో మన రైతులు అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంటోంది. భారత్‌లో రైతుల ఉత్పత్తి.. అంతర్జాతీయ మార్కెట్ల అంచనాలకు మధ్య చాలా అంతరం ఉంది. వాస్తవానికి మనకున్న భూములు, నీటి వనరులు లెక్కలోకి తీసుకొంటే 2031 నాటికి 800 బిలియన్‌ డాలర్ల ఆదాయం కేవలం వ్యవసాయ రంగం నుంచే సాధించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇందుకోసం 270 బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించే పాలసీలను తీసుకురావాల్సి ఉంది. ఇటువంటి సాంకేతికత చౌకగా లభించేందుకు ఈ రంగంలోని స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

•  వ్యవసాయ రంగంలో టెక్నాలజీని తీసుకురావడానికి 2022 బడ్జెట్‌లోనే పునాదులు వేశారు. కిసాన్‌ డ్రోన్లను ప్రమోట్‌ చేసేలా అగ్రిటెక్‌ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు నాబార్డ్‌ కింద ఓ నిధిని ఏర్పాటు చేసింది. బ్లాక్‌చైన్‌, కృత్తిమ మేధ, డ్రోన్లు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను వ్యవసాయ రంగానికి అన్వయించడమే అసలైన సవాలు. 2023-24 బడ్జెట్‌లో వీటికి ప్రత్యేక కేటాయిపులు చేయడంతో పాటు.. పన్ను రాయితీలు ఇవ్వాలి. అగ్రిటెక్‌ రంగంలోని ప్రభుత్వ నిబంధనలను సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేకమైన పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేయాలి. 

•  వ్యవసాయానంతర నష్టాలను తగ్గించడం కూడా ప్రభుత్వానికి సవాలే. ముఖ్యంగా పండ్లు, కోడి గుడ్లు, మత్స్య పరిశ్రమలో ఈ నష్టాలు పెద్దగా తగ్గలేదు. కనీసం 6శాతానికి పైగా ఉత్పత్తి వృథాగా పోతోంది. పప్పు ధాన్యాలు, కాయగూరలు, పౌల్ట్రీ రంగాల్లో కూడా ఈ నష్టాలు 4శాతానికి పైగానే ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా నిల్వ (గోదాములు), రవాణా సౌకర్యాలు మెరుగుపడితేనే ఈ నష్టాలను తగ్గించడం సాధ్యమవుతుంది. రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థల వద్ద వృథాగా ఉన్న భూమిలో ప్రభుత్వ-ప్రైవేటు రంగాలు సమష్టిగా గోదాములను ఏర్పాటు చేయడం వంటి చర్యలు సత్ఫలితాలను ఇవ్వొచ్చు. 

•  దేశీయంగా వంట నూనెల దిగుమతులను తగ్గించేందుకు జాతీయ స్థాయి కార్యక్రమం చేపట్టాలని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ కోరుతోంది. అప్పుడే దేశీయంగా ఉత్పత్తి పెరుగుతుందని  సంఘ అధ్యక్షుడు అజేయ్‌ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు.  ఏటా రూ.25వేల కోట్లు చొప్పున ఐదేళ్లు వెచ్చించినా.. దిగుమతుల బిల్లు భారీగా తగ్గుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని