Google: డిజిటల్‌ భారత్‌కు సహకరించాం.. సీసీఐ జరిమానాపై గూగుల్‌ స్పందన

Google: సీసీఐ విధించిన రూ.936 కోట్ల భారీ జరిమానాపై గూగుల్‌ స్పందించింది. నాణ్యమైన సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. డిజిటల్‌ భారత్‌కు తాము సహకరించామని చెప్పుకొచ్చింది.

Updated : 26 Oct 2022 14:07 IST

దిల్లీ: తాము అనుసరిస్తున్న విధానాలు డిజిటల్‌ భారత్‌ అవతరణకు దోహదం చేశాయని గూగుల్‌ (Google) తెలిపింది. డిజిటల్‌ కార్యకలాపాలు విస్తరించడంలోనూ గూగుల్‌ చర్యలు ఉపకరించాయని పేర్కొంది. తమ వినియోగదారులు, డెవలపర్లకు తాము మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా (CCI) రూ.936.44 కోట్ల జరిమానా విధించిన నేపథ్యంలో గూగుల్‌ (Google) ఈ విధంగా స్పందించింది.

‘‘మా వినియోగదారులు, డెవలపర్లకు మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నాం. సీసీఐ తీసుకున్న నిర్ణయంపై ఎలా ముందుకు వెళ్లాలని మేం సమీక్షించుకుంటున్నాం. ఆండ్రాయిడ్‌, గూగుల్ ప్లే అందించే సాంకేతికత, భద్రత, వినియోగదారు రక్షణలు, అసమానమైన ఎంపికలు, సౌలభ్యం నుంచి భారతీయ డెవలపర్లు ప్రయోజనం పొందారు. ఖర్చులను తక్కువగా ఉంచడం ద్వారా, మా మోడల్ భారతదేశ డిజిటల్ పరివర్తనకు శక్తినిచ్చింది. కోట్ల మందికి డిజిటల్‌ సాధనాలను చేరువచేసింది’’ అని గూగుల్‌ అధికార ప్రతినిధి అన్నారు.

గూగుల్‌పై సీసీఐ రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. ప్లే స్టోర్‌ విధానాల్లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అనైతిక వ్యాపార కార్యకలాపాల నిరోధానికి చర్యలు చేపట్టాల్సిందిగా, నిర్దేశిత సమయంలోగా తన ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా గూగుల్‌ను ఆదేశించింది. గూగుల్‌పై సీసీఐ కొరడా ఝుళిపించడం గత రెండు వారాల్లో ఇది రెండో సారి కావడం గమనార్హం. పలు విపణుల్లో, ఆండ్రాయిడ్‌ మొబైళ్ల విభాగంలో గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నందున సీసీఐ అక్టోబరు 20న రూ.1,337.76 కోట్ల జరిమానా వేసింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వ్యవస్థలో యాప్‌ డెవలపర్లకు గూగుల్‌ ప్లేస్టోర్‌ కీలక సరఫరా ఛానెల్‌గా వ్యవహరిస్తోంది. మార్కెట్‌కు వచ్చే యాప్‌లపై యాజమానులకు నియంత్రణ ఇస్తోంది. జరిమానాతో పాటు థర్డ్‌-పార్టీ బిల్లింగ్‌/ యాప్‌ల కొనుగోలుకు చెల్లింపు సేవలను వినియోగించుకోకుండా యాప్‌ డెవలపర్లను అడ్డుకోరాదని సీసీఐ ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు