క్యాపిటల్ ప్రొటక్షన్ ఓరియెంటెడ్ ఫండ్ అంటే...
మదుపర్లలో వివిధ రకాల నష్టభయం కలిగిన వారు ఉంటారు. కొందరు తమ పెట్టుబడి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. లాభం రాక పోయిన ఫర్వాలేదు కానీ నష్టం మాత్రం రాకూడదనుకుంటారు.....
పెట్టుబడికి భద్రత కల్పించే క్యాపిటల్ ప్రొటక్షన్ ఓరియంటెడ్ ఫండ్ల గురించి తెలుసుకుందాం.
మదుపర్లలో వివిధ రకాల నష్టభయం కలిగిన వారు ఉంటారు. కొందరు తమ పెట్టుబడి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. లాభం రాక పోయిన ఫర్వాలేదు కానీ నష్టం మాత్రం రాకూడదనుకుంటారు. వారి కోసమే ఈ క్యాపిటల్ ప్రొటక్షన్ఓరియంటెడ్ ఫండ్లు. సాధారణంగా మ్యూచువల్ ఫండ్లలో ఎవరైనా లాభం కోసమే ట్టుబడి చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితి కలగకూడదనుకుంటే మీపెట్టుబడికి భద్రత నిచ్చే ఫండ్ల గురించి తెలుసుకోవాల్సిందే. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడికి భద్రత ప్రాధాన్యం ఇచ్చే లక్షణం కలిగిన వాటిని క్యాపిటల్ ప్రొటక్షన్ఓరియంటెడ్ ఫండ్లు అంటారు. ఇవి క్లోజ్ ఎండెడ్ ఫండ్లు. నిర్ణీత కాలపరిమితితో ఉంటాయి. ఫండ్ నిర్వాహకుల ద్వారా మధ్యలో యూనిట్లను కొనుగోలు లేదా అమ్మకం చేసే వీలుండదు. స్టాక్ ఎక్స్ఛేంజీ ద్వారా క్రయవిక్రయాలు చేసే వీలుంటుంది. అందుకే ఈ ఫండ్లు స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయి ఉంటాయి.
పెట్టుబడి వ్యూహం:
క్యాపిటల్ ప్రొటక్షన్ ఓరియెంటెడ్ ఫండ్ నిర్వాహకులు పెట్టుబడి చేసేందుకు రెండు మార్గాలను ఎంచుకుంటారు. ఆ ఫండ్ నిర్వాహకులు మొత్తం మదుపును రెండు భాగాలుగా విభజిస్తారు.స్థిరాదాయ (డెట్ ) పథకాల్లో మదుపుకు రక్షణ ఉంటుంది. కాబట్టి 80-100 శాతం పెట్టుబడిని స్థిరాదాయ పథకాల్లో మదుపుచేస్తారు. వాటిపై కచ్చితమైన రాబడి వస్తుంది.
ఇంకా మిగిలిన 0-20 శాతాన్ని డెరివేటివ్లు కొనుగోలుచేస్తారు… ఇందులో కేవలం ఆప్షన్లను కొనుగోలు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి గరిష్టంగా వచ్చే నష్టం ప్రీమియం చెల్లించిన సొమ్ము మాత్రమే.స్థిరాదాయ పెట్టుబడి సాధనాల ద్వారా వచ్చే రాబడి ప్రీమియం చెల్లింపులకు దాదాపు సమానంగా ఉంటుంది. ఈ వ్యూహంలో అసలు పెట్టుబడి భద్రంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
నష్టభయం:
ఫండ్లు చేసే డెట్ సాధనాల క్రెడిట్ రేటింగు ఉత్తమమైనదై ఉండాలి. తక్కువ రేటింగు ఉన్న బాండ్లలో మదుపుకు డీఫాల్టు రిస్కు పొంచి ఉంటుంది. మదుపర్లు పెట్టుబడి చేసే ముందు ఈ విషయం పరిగణనలోనికి తీసుకోవాలి. వడ్డీలో హెచ్చుతగ్గుల మూలంగా లాభనష్టాల్లో ఏదైనా చేకూరే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లలో అకాల మార్పుల ప్రభావం మదుపుపై వచ్చే రాబడి పై ప్రభావం ఉంటుంది.
రాబడి:
వీటి రాబడి స్థిరంగా ఉంటుంది. అధిక భాగం స్థిరాదాయ పథకాల్లో మదుపుచేయడం మూలంగా రాబడి తక్కువగా నే ఉంటుంది. అయితే ఈక్విటీలో మదుపుచేసిన భాగం పనితీరు పై రాబడి ఆధారపడి ఉంటుందనే చెప్పాలి. ప్రధానంగా మార్పులు వచ్చేవి ఈక్విటీ విభాగంలోనే కాబట్టి మార్కెట్ ఒడుదొడుకుల కారణంగా ఈక్విటీ లాభం లేదా నష్టాలను పొందొచ్చు.
ఈ ఫండ్లు మదుపుచేసే సాధనాలు:
ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్లు, స్వల్పకాలపరిమితి ఉన్న స్థిరాదాయ పెట్టుబడులు, సెబీ, ఆర్బీఐ గుర్తించిన వాటిలో పెట్టుబడి చేస్తుంది. ఎక్స్ఛేంజ్ లో నమోదైన డెరివేటివ్ కాంట్రాక్టులను తీసుకుంటుంది. సాధారణంగా అత్యుత్తమ క్రెడిట్ రేటింగు ఉన్న సాధనాలను మాత్రమే ఎంచుకుంటాయి. ఈ విషయంలో నిబంధనల ప్రకారం ఫండ్ల నడుచుకోవాలి.
చివరగా…
దీని పేరులో ఉన్నట్లే ఈ ఫండ్ల నిర్వాహకులు అసలు మదుపు నష్టపోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. అయితే ఇది కచ్చితమైన హామీకాదని, నమ్మకం మాత్రమే అని మదుపర్లు గుర్తుంచుకోవాలి. ఈ ఫండ్లు పెట్టుబడి భద్రతే ప్రధానంగా పనిచేస్తాయి కాబట్టి రాబడి అంత ఆశాజనకంగా ఉండదు. అందులోనూ ఇవి క్రియాశీలక ఫండ్లు కాబట్టి మేనేజరు పనితనంపై ఆధారపడి ఉంటాయి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు