Hindenburg: భారత మార్కెట్లను వణికిస్తున్న అంబులెన్స్‌ డ్రైవర్‌..!

38 ఏళ్ల ఓ యువకుడు భారత మార్కెట్లలో కల్లోలం రేపాడు. అతడి సంస్థ ఇచ్చిన నివేదిక దెబ్బకు మార్కెట్లలో రూ. 10 లక్షల కోట్లు ఆవిరైపోయాయి.  

Updated : 29 Jan 2023 12:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఓ కంపెనీ ఇచ్చిన నివేదికతో చలిజ్వరం వచ్చినట్లు వణుకుతున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.10 లక్షల కోట్లను పోగొట్టుకొన్నాయి. ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా 7వ స్థానానికి పడిపోయాడు. ఇక దేశంలో కార్పొరేట్‌ దిగ్గజాల్లో ఒకటైన అదానీ గ్రూప్‌ విలువ ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఇంతటి ఆర్థిక ప్రకంపనలకు కారణం న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే ‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చి’ సంస్థ ఇచ్చిన నివేదిక.  

ఏమిటీ హెండెన్‌బర్గ్‌ రీసెర్చి..?

న్యూయార్క్‌ కేంద్రంగా హిండెన్‌బర్గ్‌ రీసెర్చి సంస్థ పనిచేస్తోంది. 2017లో నాథన్‌ అండర్సన్‌ దీనిని స్థాపించాడు. ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని తన వెబ్‌సైట్‌లో స్వయంగా వెల్లడించింది. పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్‌లను ఇది విశ్లేషిస్తుంది. ఫైనాన్షియల్‌ ఫోరెన్సిక్‌ రీసెర్చి సేవలు అందిస్తుంది. కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను గుర్తిస్తుంది.  ఈ కంపెనీ షార్ట్‌సెల్లింగ్‌లో కూడా పెట్టుబడులు పెడుతుంది. 

మార్కెట్‌లోని ప్రతి లావాదేవీలో ‘ముందు కొనడం- తర్వాత అమ్మడం’ లేదా ‘ముందు అమ్మడం - తర్వాత కొనడం’ జరుగుతాయి. షేర్లను కొని.. విలువ పెరిగాక విక్రయించి లాభాలు ఆర్జించవచ్చు. ఇక రెండో విధానంలో షేర్లను అధిక ధర వద్ద విక్రయించి.. తక్కవ ధర వద్ద కొని లావాదేవీని ముగించి లాభాలు ఆర్జించవచ్చు. సంక్షిప్తంగా ఈ రెండో విధానాన్ని  షార్ట్‌ సెల్లింగ్‌ అంటారు.

ఎవరీ నాథన్‌ అండర్సన్‌..?

నాథన్‌ అండర్సన్‌ గురించి పెద్దగా వివరాలు బయటకు తెలియవు. అమెరికాలోని కనెక్టికట్‌ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వాణిజ్యంపై డిగ్రీ పట్టా అందుకొన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లు ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో స్వచ్ఛందంగా అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేశాడు. పరిస్థితులు చేజారిపోతున్న సమయంలో కూడా ధైర్యంగా ఎలా పనిచేయాలో అక్కడే నేర్చుకొన్నట్లు అండర్సన్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అతడు తిరిగి అమెరికా వచ్చాక  ఫ్యాక్ట్‌ సెట్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేశాడు. తర్వాత వాషింగ్టన్‌లో ఓ బ్రోకర్‌ డీలర్‌ వద్ద పనిచేసినట్లు 2021లో ఫైనాన్షియల్‌ టైమ్స్ పేర్కొంది. హిండెన్‌ ప్రారంభించడానికి ముందు హారీ మార్కోపోలోస్‌తో కలిసి ప్లాటినం పార్ట్‌నర్స్‌ అనే సంస్థపై దర్యాప్తు కోసం పనిచేశాడు. హారీ గతంలో బెర్నీ మాడాఫ్‌ అనే మోసపూరిత పథకం గుట్టు విప్పేందుకు పనిచేశాడు.

హిండెన్‌బర్గ్‌ ఏదైనా కంపెనీపై గురిపెడితే తొలుత ఆరు నెలలకు పైగా పబ్లిక్‌ రికార్డులు, అంతర్గత కార్పొరేట్‌ పత్రాలను పరిశీలించి, కంపెనీ ఉద్యోగులతో మాట్లాడి సమాచారం సేకరిస్తుంది. ఆ తర్వాత హిండెన్‌బర్గ్‌తో కలిసి పనిచేసే భాగస్వాములకు వాటిని చేరవేస్తుంది. తర్వాత ఆ బృందం  మొత్తం సదరు కంపెనీ షేర్లలో షార్ట్‌ పొజిషన్లు తీసుకొంటాయి. ఆ కంపెనీ విలువ పతనమైన సమయంలో హిండెన్‌బర్గ్‌కు ఆదాయం లభిస్తుంది.

2020లో అమెరికాలోని నికోలా కార్పొరేషన్‌ను ఇలానే లక్ష్యంగా చేసుకొంది. ఆ కంపెనీలో అవకతవకలు బయటపడటంతో కంపెనీ స్టాక్‌ విలువ 40 శాతం పతనమైంది. ఆ తర్వాత అమెరికా ఎస్‌ఈసీ దర్యాప్తులో కంపెనీలో మోసం జరిగినట్లు గుర్తించారు. 2017 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 కంపెనీలను ఇది లక్ష్యంగా చేసుకొంది. వీటిల్లో ట్విటర్‌ వంటి దిగ్గజాలు కూడా ఉన్నాయి.

ఆ విపత్తు పేరు ఎందుకు..

హిండెన్‌బర్గ్‌ అనేది జర్మనీకి చెందిన ప్యాసింజర్‌ ఎయిర్‌ షిప్‌ పేరు.  1937లో న్యూజెర్సీలోని మాంచెస్టర్‌ టౌన్‌షిప్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మొత్తం 35 మంది మరణించారు. 62 మంది ప్రాణాలతో బయటపడ్డారు. హిండెన్‌బర్గ్‌ పేరును తమ సంస్థకు పెట్టడానికి కారణాన్ని కూడా వెబ్‌సైట్లో వెల్లడించారు. ‘‘హిండెన్‌బర్గ్‌ పూర్తిగా మానవుడు సృష్టించిన విపత్తు. విశ్వంలోనే అత్యధికంగా మండే స్వభావం ఉన్న హైడ్రోజన్‌ నింపిన బెలూన్‌లో 100 మందిని ఎక్కించారు. గతంలో ఇలాంటి ఎయిర్‌షిప్‌లకు ప్రమాదాలు జరిగినా.. అప్పట్లో నిర్వాహకులు భిన్నంగా ప్రయత్నించామని చెప్పారు. అయినా.. ప్రమాదం జరిగింది. మేము కూడా  మానవులు సృష్టించిన ప్రమాదాలు మార్కెట్లలో తిరుగుతుంటే వాటిని అన్వేషిస్తాం. అవి బాధితులను ఆకర్షించడానికి ముందే వాటిని వెలుగులోకి తెస్తాం’’ అని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని