Elon Musk Twitter: ట్విటర్‌పై మస్క్‌కు ఎందుకంత మక్కువ?

ట్విటర్‌ను కొనుగోలు చేయాలన్న మస్క్‌ ఆసక్తి వెనుక కారణాలేంటో చూద్దాం...

Updated : 15 Apr 2022 12:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇతర సామాజిక మాధ్యమాలతో పోలిస్తే కొన్ని విషయాల్లో ట్విటర్‌ చాలా చిన్నదనే చెప్పాలి! ఇంకా పూర్తి సామర్థ్యాన్ని అందుకోలేకపోతోందంటూ పెట్టుబడిదారులు విసుక్కున్న సందర్భాలూ ఉన్నాయి. ఫేస్‌బుక్‌ తరహాలో బిలియన్ల కొద్దీ క్రియాశీలక వినియోగదారులను ఆకర్షించడంలో ట్విటర్‌ విఫలమైందని టెక్‌ నిపుణులు చెబుతుంటారు. ట్విటర్‌తో పోలిస్తే ఫేస్‌బుక్‌ రోజువారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 11 రెట్లు అధికం. క్రితం త్రైమాసికంలో గూగుల్‌ నేతృత్వంలోని యూట్యూబ్‌తో పోలిస్తే ట్విటర్‌ ప్రకటనల ఆదాయం ఐదింతలు తక్కువ. 

అయినా, ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ బంపరాఫర్‌ ఇచ్చారు. ప్రస్తుతం ట్విటర్‌లో వాటాదారుగా ఉన్న మస్క్‌.. మిగిలిన వాటాలనూ కొనుగోలు చేస్తానని ప్రతిపాదించారు. ఒక్కో ట్విటర్‌ షేరును 54.20 డాలర్లు చొప్పున కొనుగోలు చేస్తామని, ఇందుకు 43 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3.22 లక్షల కోట్లు)కు పైగా చెల్లిస్తామని ఆఫర్‌ చేసినట్లు అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌కు ఇచ్చిన సమాచారంలో వెల్లడించారు.

ట్విటర్‌ బోర్డు ఆమోదిస్తుందా?

మస్క్‌ ఆఫర్‌ తమకు అందిందని, వాటాదార్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ట్విటర్‌ ప్రకటించింది. దీనిపై నిపుణులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మస్క్‌ 9.2 శాతం వాటా కొనుగోలు చేయడానికి ముందు ట్విటర్‌ షేరు విలువ 39.91 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ప్రస్తుతం ఆయన ఒక్కో షేరుకు 54.20 డాలర్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రీమియం చాలా ఎక్కువ ఉన్నందున బోర్డు ఆమోదం తెలిపే అవకాశం లేకపోలేదని కొంతమంది టెక్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మస్క్‌ కొనుగోలు ప్రతిపాదనకు ట్విటర్‌ బోర్డు అంగీకరించే అవకాశాలు చాలా చాలా తక్కువని మరికొందరు టెక్‌ పండితులంటున్నారు. క్రితం వేసవిలో ట్విటర్‌ షేరు ధర 70 డాలర్ల వరకు వెళ్లిందని.. దాంతో పోలిస్తే మస్క్‌ ఆఫర్‌ తక్కువేనంటున్నారు.

మస్క్‌కి ప్లాన్‌-బి ఉందా?

తన ప్రతిపాదనను ట్విటర్‌ అంగీకరిస్తుందో లేదో తనకు ఏమాత్రం అవగాహన లేదని ఎలాన్ మస్క్‌ అన్నారు. గురువారం జరిగిన టెడ్‌ 2022 సమావేశంలో మాట్లాడుతూ.. ఒకవేళ ట్విటర్‌ను సొంతం చేసుకోవడంలో విఫలమైతే తన వద్ద ప్లాన్‌-బి ఉందని స్పష్టం చేశారు. అదేంటో మాత్రం వెల్లడించలేదు. అయితే, పాశ్చాత్య మీడియాలో పేర్కొంటున్నట్లుగా మస్క్‌ ‘హోస్టైల్‌ టేకోవర్‌’ దిశగా వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం మస్క్‌ ట్విటర్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉన్నందున.. ఆ సంస్థ యాజమాన్య ఇష్టా అయిష్టాలతో సంబంధం లేకుండా కంపెనీని తన గుప్పిట్లోకి తీసుకునే అవకాశం ఉంది. దీనికోసం ఆయన నేరుగా ఇతర వాటాదారులను సంప్రదించి ఒప్పందం చేసుకోవచ్చని విశ్లేషిస్తున్నారు. బహుశా ప్లాన్‌-బి ఇదే అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మస్క్‌ ఎందుకు కొనాలనుకుంటున్నారు?

డబ్బు కోసం తాను ట్విటర్‌ను కొనుగోలు చేయడం లేదని మస్క్‌ టెడ్‌ సమావేశంలో చెప్పారు. భవిష్యత్తు నాగరికతకు అందరి ఆమోదం పొందిన ఒక సమగ్రమైన ప్రజా వేదిక అవసరమని తాను భావిస్తున్నానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛగా మాట్లాడుకునేందుకు అనువైన ప్లాట్‌ఫామ్‌గా ట్విటర్‌ అవతరిస్తుందన్న నమ్మకం తనకు ఉందని కొనుగోలు ప్రతిపాదన సమయంలో చెప్పారు. ప్రజాస్వామ్య మనుగడకు వాక్‌ స్వాతంత్య్రం అవసరమన్నారు. అయితే ప్రస్తుతం ట్విటర్‌ నడుస్తున్న తీరు ఆ విధంగా లేదన్నారు. ట్విటర్‌ ప్రైవేట్‌ కంపెనీగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆయన కొన్ని మార్పులను కూడా సూచించిన విషయం తెలిసిందే.

గుప్పిట్లోకి శక్తిమంతమైన సాధనం?

మస్క్‌ ట్విటర్‌ను సొంతం చేసుకున్నా.. చేసుకోకపోయినా.. దాంట్లో మార్పులు జరిగినా.. జరగకపోయినా.. ఈ మాధ్యమం ఎంత విలువైందనే విషయం మాత్రం స్పష్టమైంది. చాలా విషయాల్లో ఇప్పటికే ఇది ప్రభావవంతమైన వేదికగా పేరు తెచ్చుకుంది. పెద్ద పెద్ద వ్యక్తులకు శక్తిమంతమైన సమాచార సాధనంగా మారింది. మరోవైపు ఎలాంటి గుర్తింపు లేని సామాన్య ప్రజల గొంతుకను ‘ట్రెండింగ్‌’ పేరిట వెలుగులోకి తెస్తోంది. రోజుకి 200 మిలియన్ల మంది యాక్టివ్‌ యూజర్లే ఉన్నప్పటికీ.. రాజకీయాల రూపురేఖల్నే మార్చేస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ట్విటర్‌ ప్రభావం పెద్ద ఎత్తున ఉందనే చెప్పాలి. ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ట్విటర్‌ నుంచి బహిష్కరణకు గురయ్యేంత వరకు దాన్ని ఎంత విరివిగా ఉపయోగించారో చూశాం. అలా ట్విటర్‌ నిషేధానికి గురైన చాలా మంది ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువవుదామని చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

ట్విటర్‌కు ఇంత విలువ ఉన్నప్పటికీ.. కొందరు అపవాదునూ అంటించారు. అసంబద్ధ కుట్ర సిద్ధాంతాలు, కొవిడ్‌ సమయంలో హానికరమైన ఆరోగ్య విషయాలు, సామాజిక అసహనం, అల్లర్లు, హింసకూ కొన్ని ట్వీట్లు దారి తీసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ట్విటర్‌ ఇటీవల అనేక కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో ట్వీట్‌లకు ట్యాగ్‌లు తగిలించడం ప్రారంభించింది. ఇది వాక్‌ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తోందన్నది కొందరి వాదన. బహుశా ఈ కారణాల వల్లే మస్క్‌ ట్విటర్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంత ప్రభావవంతమైన మీడియాను తన గుప్పిట్లో పెట్టుకోవడం సహా.. చర్చకు.. వాదోపవాదాలకు దారితీసే సమాచారాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలనే భావనతోనే మస్క్‌ ట్విటర్‌ కొనుగోలుకు ముందుకు వచ్చి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మీడియాపై నియంత్రణ?

కొంతమంది నిపుణులు మరో వాదననూ తెరపైకి తీసుకొస్తున్నారు. బిలియనీర్ల జాబితాలో ఆయన సహచరులైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఇప్పటికే వాషింగ్టన్‌ పోస్ట్‌ను కొనుగోలు చేసి మీడియా రంగంలోకి ప్రవేశించారు. మరోవైపు పాట్రిక్‌ సూన్‌ షియోంగ్‌ లాస్‌-ఏంజెల్స్‌ టైమ్స్‌ను, లారెన్‌ పావెల్‌ జాబ్స్‌-అట్లాంటిక్‌ను, మైకేల్‌ బ్లూమ్‌బెర్గ్‌.. బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌ను సొంతం చేసుకున్నారు. అదే తరహాలో మస్క్‌ సైతం ట్విటర్‌ ద్వారా మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, వీరంతా ప్రభ కోల్పోయిన మీడియా సంస్థలకు కొత్త రూపాన్నిస్తే.. మస్క్‌ మాత్రం అత్యంత ప్రభావవంతమైన ట్విటర్‌ను సొంతం చేసుకోవాలనుకుంటుండడం గమనార్హం.

భవిష్యత్తు ఇంధనం కోసమా?

సమాచారమే ఆధునిక ఇంధనమని మనమంతా విని ఉన్నాం. బహుశా మస్క్‌ ఆసక్తికి ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చని యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా ఆచార్యుడు కారెన్‌ నార్త్‌ తెలిపారు. ట్వీట్ల కంటే ట్విటర్‌లో ఉన్న వినియోగదారుల సమాచారంపైనే మస్క్‌ గురి ఉండొచ్చని విశ్లేషించారు. వాక్‌ స్వాతంత్ర్యాన్ని మరింత పెంచడం వల్ల ప్రజలు చాలా స్వేచ్ఛగా తమ భావాల్ని వ్యక్తపరుస్తారని అన్నారు. ఫలితంగా ఆ సమాచారాన్నంతా సొమ్ము చేసుకోవచ్చన్నది మస్క్‌ వ్యూహమై ఉంటుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని