Wipro: వేతనాల పెంపు ఆపట్లేదు.. 3 నెలలకోసారి ప్రమోషన్‌!

సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును ఆపడం లేదని ప్రముఖ ఐటీ సంస్థ విప్రో వెల్లడించింది....

Updated : 18 Aug 2022 13:05 IST

బెంగళూరు: సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును ఆపడం లేదని ప్రముఖ ఐటీ సంస్థ విప్రో వెల్లడించింది. మీడియాలో వస్తున్నట్లుగా తాము ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే తొలి దశ ప్రమోషన్లు కూడా పూర్తయ్యాయని తెలిపింది.

ఏప్రిల్‌-జూన్‌లో విప్రో లాభాలు తగ్గిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగుల వేతనాల్లో భాగమైన ‘వేరియబుల్‌ పే’ను కంపెనీ నిలిపివేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ స్పందించింది. అయితే, వేతనాల పెంపుపై మాత్రమే స్పష్టతనిచ్చింది. ‘వేరియబుల్‌ పే’ చెల్లింపు మొత్తంపై మాత్రం తాము ఎలాంటి ప్రకటన చెయలేమంటూ సమాధానాన్ని దాటవేసింది. ఈ కంపెనీ ప్రతి మూడు నెలలకొకసారి ఉద్యోగులకు ‘వేరియబుల్‌ పే’ చెల్లిస్తుంటుంది.

మరోవైపు జులై నుంచి ప్రమోషన్లు క్రమంగా అమల్లోకి వస్తున్నాయని విప్రో తెలిపింది. అలాగే మెరుగైన ప్రతిభ కనబరిచిన ‘మిడ్‌ మేనేజ్‌మెంట్‌’ స్థాయి వరకు ఉద్యోగులకు త్రైమాసికాలవారీగానూ ప్రమోషన్లు ఇస్తామని తెలిపింది. ఏప్రిల్‌-జూన్‌లో విప్రో మార్జిన్లు వార్షిక ప్రాతిపదికన 18.8 శాతం నుంచి 15 శాతానికి తగ్గాయి. ఐటీ రంగంలో ఉద్యోగుల వలసల రేటు అధికంగా ఉండడంతో ఇటీవల కంపెనీలు వేతనాలను భారీగా పెంచాయి. దీనివల్లే తమ మార్జిన్లు తగ్గినట్లు పలు కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాల వ్యాఖ్యానాల్లో పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని