Zoom: జూమ్‌ ప్రెసిడెంట్‌కు ఉద్వాసన..!

ఫిబ్రవరిలో 15 శాతం ఉద్యోగులపై వేటు వేసిన జూమ్‌ సంస్థ ఈ సారి ఏకంగా ప్రెసిడెంట్‌ను తొలగించింది. దీనికి కచ్చితమైన కారణం కూడా వెల్లడించలేదు. 

Updated : 25 Mar 2023 16:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వీడియో కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంస్థ జూమ్‌  (Zoom)  ఉద్యోగులపై కూడా వేటు వేయడం మొదలుపెట్టింది. ఇటీవలే కంపెనీ ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ టూంబ్‌కు ఉద్వాసన పలికింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గ్రెగ్‌ తొలగింపునకు ఎటువంటి కారణాన్ని కంపెనీ తెలియజేయలేదు. జూన్‌2022లో కంపెనీలోని టాప్‌ పోస్టుకు ప్రమోట్‌ చేశారు. అంతలోనే ఆయన్ను తొలగించడం చాలా మందిని  ఆశ్చర్యానికి గురిచేసింది. జూమ్‌(Zoom)లో ఆయన ప్రయాణం ఏడాది కూడా సాగలేదు. 

గ్రెగ్‌ స్థానంలో మరో వ్యక్తిని ఇప్పటి వరకు కంపెనీ ప్రకటించలేదు. దీనిపై జూమ్‌ ప్రతినిధి మాట్లాడుతూ గ్రెగ్‌ స్థానాన్ని భర్తీ చేసే ఆలోచన ఇప్పటి వరకు కంపెనీ చేయలేదని వెల్లడించారు. కంపెనీ ప్రెసిడెంట్‌ పోస్టును ఖాళీగా పెట్టడం వెనుక కారణాన్ని వెల్లడించలేదు. 2019లో జూమ్‌లో చీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌గా గ్రెగ్‌ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ప్రమోషన్‌పై ప్రెసిడెంట్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ కంపెనీలోకి రావడానికి ముందు గ్రెగ్‌ గూగుల్‌లో విక్రయాలు, వర్క్‌స్పేస్‌, సెక్యూరిటీ, జియోఎంటర్‌ప్రైజ్‌ విభాగాలకు వైస్‌ప్రెసిడెంట్‌గా మే 2021 వరకు ఉన్నారు. 

జూమ్‌ (Zoom) ఫిబ్రవరిలో భారీగా ఉద్యోగాల(lay-offs) కోతను ప్రకటించింది. మొత్తం 1,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ కోత ఆ సంస్థలోని ఉద్యోగుల్లో 15 శాతానికి సమానం. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న తమ సిబ్బందికి చట్ట ప్రకారం 16 వారాల వేతనం, హెల్త్‌కేర్‌ కవరేజీ, 2023 ఆర్థిక  సంవత్సరానికి సంబంధించిన బోనస్‌(ప్రతిభ ఆధారంగా), ఆరునెలల పాటు స్టాక్‌ ఆప్షన్‌పై అధికారం ఇవ్వగా.. అమెరికాయేతర దేశాల్లోని తమ ఉద్యోగుల కోసం ఆగస్టు 9వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ‘‘వ్యాపారాల్లో ఇబ్బందికర పరిస్థితులను తొలగించాడానికి జూమ్‌ను ఏర్పాటు చేశాం. కొవిడ్‌ సమయంలో మా కంపెనీ దశ మారింది. దీంతో ప్రజల మధ్య కనెక్టివిటీని పెంచడానికి వేగవంతంగా నియామకాలు చేపట్టాం. 24 నెలల్లో మా సంస్థ 3 రెట్లు పెరిగింది. భవిష్యత్తులో కూడా మా సృజనాత్మకత కొనసాగిస్తాం’’ అని అప్పట్లో కంపెనీ సీఈవో ఎరిక్‌ యువాన్‌ పేర్కొన్నారు. ఈ సారి తన వార్షిక వేతనంలో కూడా 98శాతం కోత విధించుకొంటున్నట్లు ఎరిక్‌ వెల్లడించాడు. అంతేకాదు.. ఎగ్జిక్యూటీవ్‌ బోనస్‌ను వదులుకొంటున్నట్లు ప్రకటించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని