Job Cuts: మరో అరగంటలో మీ ఇన్‌బాక్స్‌లోకి మెయిల్ వస్తుంది.. 1,300 ఉద్యోగాలకు కోతవేసిన జూమ్

కొవిడ్‌ సమయంలో పెరిగిన డిమాండ్‌ను అందుకోవడానికి ఉద్యోగాలను నియమించుకొని.. ఆ తర్వాత ఉద్యోగులపై వేటు వేస్తున్న కంపెనీల జాబితాలో జూమ్‌ (Zoom) కూడా చేరింది. దాదాపు 15శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది. 

Updated : 25 Mar 2023 16:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంస్థ జూమ్‌ (Zoom) భారీగా ఉద్యోగాల(lay-offs) కోతను ప్రకటించింది. మొత్తం 1,300 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది  ఆ సంస్థలోని ఉద్యోగుల్లో 15 శాతానికి సమానం. అమెరికాలో లేఆఫ్‌లకు గురైన ఉద్యోగులకు మరో అర గంటలో ఈమెయిల్‌ వస్తుందని జూమ్‌ సంస్థ సీఈవో ఎరిక్‌ యువాన్‌ కంపెనీ అధికారిక బ్లాగ్‌లో ప్రకటించారు. లేఆఫ్‌లకు గురైన ఉద్యోగులు ప్రతిభావంతులు, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులుగా ఆయన అభివర్ణించారు.

‘‘తొలగిస్తున్న ఉద్యోగుల జాబితాలో ఉన్న అమెరికాలో పనిచేసే వారి ఈ మెయిల్స్‌ ఇన్‌ బాక్స్‌లకు మరో 30 నిమిషాల్లో సందేశాలు వస్తాయి. ఇక అమెరికా బయట పనిచేసేవారి విషయంలో స్థానిక నిబంధనలకనుగుణంగా నడుచుకొంటాం’’ అని యువాన్‌ పేర్కొన్నారు. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న సిబ్బందికి చట్ట ప్రకారం 16 వారాల వేతనం, హెల్త్‌కేర్‌ కవరేజీ, 2023 ఆర్థిక  సంవత్సరానికి సంబంధించిన బోనస్‌(ప్రతిభ ఆధారంగా), ఆరునెలల పాటు స్టాక్‌ ఆప్షన్‌పై అధికారం ఇవ్వగా.. అమెరికాయేత ఉద్యోగుల కోసం ఆగస్టు 9వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఇక అమెరికాయేతర ప్రదేశాల్లోని జూమీస్‌(జూమ్‌ ఉద్యోగులు)కు స్థానిక చట్టాలను పరిగణనలోకి తీసుకొంటే ఇదే వర్తిస్తుంది.

తాజాగా ఉద్యోగాల కోత విధిస్తున్న టెక్‌ కంపెనీల జాబితాలోకి జూమ్‌(Zoom) కూడా వచ్చి చేరింది. కొవిడ్‌ సమయంలో గిరాకీ పెరగడంతో చాలా టెక్‌ కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాయి. కానీ, పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లు తగ్గడంతో ఈ కంపెనీల రెవెన్యూలు కూడా తగ్గాయి. ‘‘వ్యాపారాల్లో ఇబ్బందికర పరిస్థితులను తొలగించాడనికి జూమ్‌ను ఏర్పాటు చేశాం. కొవిడ్‌ సమయంలో మా కంపెనీ దశ మారింది. దీంతో ప్రజల మధ్య కనెక్టివిటీని పెంచడానికి వేగవంతంగా నియామకాలు చేపట్టాం. 24 నెలల్లో మా సంస్థ 3 రెట్లు పెరిగింది. భవిష్యత్తులో కూడా మా సృజనాత్మకత కొనసాగిస్తాం’’ అని ఎరిక్‌ యువాన్‌ బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఈ సారి తన వార్షిక వేతనంలో కూడా 98శాతం కోత విధించుకొంటున్నట్లు ఎరిక్‌ వెల్లడించాడు. అంతేకాదు.. ఎగ్జిక్యూటీవ్‌ బోనస్‌ను వదులుకొంటున్నట్లు ప్రకటించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని