ఒకే కుటుంబంలో 11మంది ఆత్మహత్య!

ఒకే కుటుంబంలోని 11మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 11మంది మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జోధ్‌పుర్‌ పోలీసులు వెల్లడించారు.

Updated : 10 Aug 2020 07:17 IST

పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చిన హిందూ కుటుంబం
రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ జిల్లాలో ఘటన

జోధ్‌పుర్‌: ఒకే కుటుంబంలోని 11మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. జోధ్‌పూర్‌లో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలోని 12మంది విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 11మంది మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు జోధ్‌పుర్‌ పోలీసులు వెల్లడించారు.

రాజస్థాన్‌లోని దేచు పోలీస్‌స్టేషన్ పరిధిలోని తోహ్‌దాత గ్రామంలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలం క్రితం పాకిస్థాన్‌ నుంచి  ఓ హిందూ కుటుంబం జోధ్‌పుర్‌కు వచ్చి నివాసముంటోంది. తోహ్‌దాత గ్రామంలో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని దానికి సమీపంలోనే నివాసం ఉంటున్నారు. ఈ కుటుంబంలోని సభ్యులందరూ నిన్న రాత్రి సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదయం ఇంటి సమీపంలో ఈ కుటుంబంలోని వారందరూ విగత జీవులుగా పడివుండటాన్ని గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని పరిశీలించగా అప్పటికే వారిలో 11మంది ప్రాణాలు కోల్పోయినట్లు గ్రహించారు. ఇంటి బయట ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతన్ని ఆసుపత్రికి తరలించారు. క్లూస్‌టీంతోపాటు ప్రత్యేక దర్యాప్తు బృందం అక్కడకు చేరుకొని ఘటనకు కారణాలను విశ్లేషిస్తున్నారు.

ఘటనా స్థలాన్ని జోధ్‌పుర్‌ జిల్లా ఎస్పీ రాహుల్‌ భర్హత్‌ పరిశీలించారు. సామూహిక మరణాలకు గల కారణాలు తెలియలేదని, వారి శరీరంపై ఎలాంటి గాయాల మరకలు కూడా లేవని ఎస్పీ రాహుల్‌ మీడియాకు తెలిపారు. ఏదో ఒక విషయంపైనే కుటుంబసభ్యుల మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న రాత్రి వేళలో సామూహికంగా విషం తీసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తిని విచారిస్తే పూర్తి సమాచారం దొరికే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని