యువతిపై రాక్షస దాడి.. 12మంది అరెస్టు! 

బంగ్లాదేశ్ యువతిపై బెంగళూరు నగరంలో మే నెలలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం కేసును పోలీసులు పూర్తిగా ఛేదించారు.......

Published : 09 Jul 2021 01:28 IST

ముగిసిన దర్యాప్తు.. పోలీసులకు రూ.లక్ష రివార్డు

బెంగళూరు: బంగ్లాదేశ్ యువతిపై బెంగళూరు నగరంలో మే నెలలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం కేసును పోలీసులు పూర్తిగా ఛేదించారు. 22 ఏళ్ల యువతిపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి వీడియో రికార్డు చేసి వైరల్‌ చేసిన వ్యవహారంలో 12మందిని అరెస్టు చేసినట్టు బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ కమల్‌ పంత్‌ వెల్లడించారు. ఈ కేసులో 11మంది నిందితులు బంగ్లాదేశ్‌కు చెందినవారేనని, వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు తెలిపారు. అనేక మలుపులతో సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును ఐదు వారాల వ్యవధిలోనే ముగించినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించినట్టు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసిన బృందాన్ని ప్రశంసించడంతో పాటు రూ.లక్ష రివార్డును మంజూరు చేసినట్టు వెల్లడించారు.

కేసులో ట్విస్ట్‌లు..
బెంగళూరులో మే నెలలో వెలుగులోకి వచ్చిన ఈ అత్యాచార ఘటన క్షణానికో మలుపు తిరిగింది. నిందితులు ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి.. అడ్డంగా దొరికిపోయినప్పటికీ తొలి వీడియో వైరల్‌ అవుతుండగానే మరో వీడియో పోస్టు చేశారు. అసోం, బంగ్లాదేశ్‌లలో ఆ యువతి, యువకులతో పరిచయం ఉన్న వారి ఫిర్యాదులతో బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగారు. అప్పట్లోనే నలుగురు యువకులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన హకీల్‌, బంగ్లాదేశ్‌కు చెందిన సాగర్‌, మహ్మద్‌ బాబా కేశ్‌, రియాద్‌ బాబు, నస్రత్‌, కాజల్‌ను నిందితులుగా గుర్తించారు. యువతులిద్దరూ రియాద్‌ బాబు భార్యలు కావడం గమనార్హం.  రియాద్‌ బాబు, సాగర్‌ పారిపోయే క్రమంలో పోలీసు కాల్పుల్లో గాయపడ్డారు. నిందితులపై మానవ అక్రమ రవాణా, అత్యాచారం, నిర్భయ.. తదితర చట్టాల కింద కేసులు నమోదు చేశారు. 

దారుణం వెలుగులోకి ఇలా..

రెండేళ్ల కిందట పొట్ట చేతపట్టుకుని బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చిన బాధిత యువతి స్థానికంగా ఓ బార్‌లో డ్యాన్సర్‌గా ఉపాధి పొందేది. అంతకు పూర్వమే ఆమె దుబాయ్‌లో బార్‌లో ఇలాంటి పనే చేసేదని పోలీసులు గుర్తించారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఆమె హైదరాబాద్‌లో ఒక మసాజ్‌ పార్లర్‌లో పని చేసింది. తనకు పరిచయం ఉన్న నలుగురు యువకులు, ఇద్దరు యువతులను బంగ్లాదేశ్‌ నుంచి అసోం మార్గంలో భారత్‌లోకి తీసుకు వచ్చి బెంగళూరులో కుదురుకునేలా చేసింది. ఇక్కడి సుబ్రహ్మణ్యనగరలో ఇంటిని అద్దెకు తీసుకుని బంగ్లాదేశ్‌కు చెందిన నిందితులకు అదే చిరునామాతో ఆధార్‌ కార్డులనూ సమకూర్చింది. విషాదమేమంటే.. ఆమె రప్పించిన వ్యక్తులే ఆమెను బలవంతంగా పడుపువృత్తి చేయించారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే యువతులతోనూ నిందితులు ఇదే పని చేయించేవారట. ఆమె చివరికి పడుపు వృత్తి మానేసి సొంతంగా స్పా పెట్టుకుంటానని చెప్పడంతో నగదు లావాదేవీల విషయంలో గొడవ మొదలైంది. నస్రత్‌, కాజల్‌ ఇద్దరూ ఒత్తిడి పెంచారు. స్పా ఏర్పాటు వద్దంటూ ఇతర నిందితులు ఆమెను మంచానికి కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శరీర సున్నిత భాగాలపై మద్యం సీసాలతో దాడి చేశారు. ఆ వీడియోలను నిందితులు మే 19న సామాజిక మాధ్యమాల్లో తమకు తెలిసిన వారితో పంచుకోగా.. అవి వైరల్‌ అయ్యాయి. వాటిని చూసిన కొందరు ఇచ్చిన ఫిర్యాదులతో ఘటన వెలుగులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని