ఆన్‌లైన్‌లో డబ్బు పోగొట్టి.. అమ్మ తిట్టిందని ఆత్మహత్య..!

మొబైల్‌ గేమ్‌ సరదా ఓ బాలుడి ప్రాణాలు తీసింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి రూ.40 వేలు పోగొట్టడంతో అమ్మ తిట్టిందని

Updated : 01 Aug 2021 04:51 IST

భోపాల్‌: మొబైల్‌ గేమ్‌ సరదా ఓ బాలుడి ప్రాణాలు తీసింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి రూ.40 వేలు పోగొట్టడంతో అమ్మ తిట్టిందని 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పుర్‌కు చెందిన ఓ బాలుడు తన తల్లిదండ్రులకు తెలియకుండా వారి బ్యాంకు ఖాతాలోని సొమ్ముతో ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతుండేవాడు. అలా ఓ రోజు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.1500 ఖర్చయినట్లు అతడి తల్లి మొబైల్‌కు సందేశం వచ్చింది. దీంతో ఆమె తన కుమారుడికి ఫోన్‌ చేసి ఆ ఖర్చుపై ప్రశ్నించింది. ఆ డబ్బును ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడేందుకు తానే వినియోగించినట్లు బాలుడు చెప్పడంతో ఆమె కుమారుడిని మందలించింది. దాంతో మనస్తాపానికి గురైన ఆ బాలుడు తన గదిలోకి వెళ్లి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకుని దర్యాప్తు చేసిన పోలీసులుకు అతడి గదిలో సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో వారికి మరిన్ని వాస్తవాలు తెలిశాయి. తన తల్లి బ్యాంకు ఖాతా నుంచి అంతకుముందు రూ.40 వేలు నగదు తీసి ఆన్‌లైన్‌లో మొబైల్‌ గేమ్‌ ఆడేందుకు వినియోగించినట్టు బాలుడు ఆ లేఖలో రాశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం చేసిన అనంతరం బాలుడి మృత దేహాన్ని అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ గేమ్‌లో బాలుడు తనకు తానుగా డబ్బు పెట్టాడా.. లేదా సొమ్ము కోసం ఎవరైనా అతడిని బెదిరించారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని