Accident: కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి!

అతివేగం కారణంగా ఓ బస్సు అదుపుతప్పి కాలువలో దూసుకెళ్లిన ఘటనలో 17మంది మృతి చెందారు. బంగ్లాదేశ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 19 Mar 2023 14:20 IST

ఢాకా: బంగ్లాదేశ్‌(Bangladesh)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. 40 మందికిపైగా ప్రయాణికులతో ఓ ప్రైవేటు బస్సు.. ఇక్కడి సోనాదంగా నుంచి దేశ రాజధాని ఢాకా(Dhaka)కు బయల్దేరింది. ఈ క్రమంలోనే.. ఆదివారం ఉదయం మార్గమధ్యలో మదరిపూర్‌ వద్ద బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలోకి వేగంగా దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు సమాచారం అందుకున్న అధికారులు..వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని వివిధ వైద్యశాలలకు తరలించినట్లు చెప్పారు.  మృతులు, క్షతగాత్రులను గుర్తించాల్సి ఉందన్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌తోపాటు మెకానికల్ వైఫల్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో పాత రోడ్లతోపాటు వాహనాల నిర్వహణ అధ్వానంగా ఉండటం, సరైన శిక్షణ లేని డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని