Crime news: ఆ లింక్‌పై క్లిక్‌ చేస్తే.. నటి సహా 40మంది ఖాతాల్లో నగదు కట్‌!

సైబర్‌ మాయగాళ్లు వేసిన వలలో ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన 40మంది అమాయకులు నగదు పోగొట్టుకున్నారు. వీరిలో టీవీ నటి శ్వేతా మేనన్‌ కూడా ఉన్నారు.

Published : 06 Mar 2023 01:38 IST

ముంబయి: సైబర్ కేటుగాళ్లు(Cyber crimes) ఏ రూపంలో వచ్చి బ్యాంకు ఖాతాల్ని కొల్లగొడతారో ఊహించడం కష్టమైపోతోంది. నిజమేదో, అబద్ధమేదో తెలియని అయోమయంలో అనేకమంది సైబర్‌ నేరగాళ్లు విసిరిన వలలో పడి మోసపోతున్నారు. తాజాగా కేవైసీ, పాన్‌ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలంటూ టెక్స్ట్‌ సందేశంలో లింక్‌ పంపగా.. దానిపై క్లిక్‌ చేసిన మూడు రోజుల వ్యవధిలోనే ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన 40మంది ఖాతాల్లోంచి రూ.లక్షల విలువైన నగదు మాయమైన ఘటన ముంబయిలో వెలుగు చూసింది. తమ కస్టమర్ల గుర్తింపును వెరిఫై చేసుకొనేందుకు బ్యాంకులు నో యువర్‌ కస్టమర్‌ (KYC) ప్రక్రియను చేపట్టగా.. సైబర్‌ నేరగాళ్లు దాన్ని తమ దోపిడీకి ఆయుధంగా మలచుకొని అమాయకుల్ని దోచేస్తున్నారు. ఇలా మోసానికి గురైన వారిలో టీవీ నటి శ్వేతా మీనన్‌ కూడా ఉన్నారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

మరోవైపు, అప్రమత్తమైన పోలీసులు బ్యాంక్ వినియోగదారుల రహస్య వివరాలను కోరే లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మోసగాళ్లు అలాంటి నకిలీ ఎస్‌ఎంఎస్‌లను వినియోగదారులకు పంపిస్తూ కేవైసీ/పాన్‌ కార్డు వివరాలను అప్‌డేట్‌ చేయకపోతే బ్యాంకు ఖాతాలు బ్లాక్‌ అయిపోతాయంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. అలా తాము పంపిన లింక్‌లపై క్లిక్‌ చేసిన వినియోగదారులను నకిలీ వెబ్‌సైట్‌కు మళ్లించి వారి ఐడీ, పాస్‌వర్డ్‌, ఇతర వివరాలను ఎంటర్‌ చేయమని అడుగుతున్నారన్నారు. ఇలా లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా మోసపోయినట్టు 40మంది ఫిర్యాదులు చేశారని.. వీరిలో టీవీ నటి శ్వేతా మీనన్‌ కూడా ఉన్నట్టు చెప్పారు. ‘‘ ఆ లింక్‌ బ్యాంకు నుంచి వచ్చినట్టు నమ్మి క్లిక్‌ చేశాను. పోర్ట్‌ ఓపెన్‌ కాగా.. అందులో కస్టమర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, ఓటీపీ ఎంటర్‌ చేశాను. ఆ తర్వాత బ్యాంకు అధికారిగా పరిచయం చేసుకుంటూ ఓ మహిళ నుంచి ఫోన్‌ వచ్చింది. తన ఫోన్‌లోకి పంపిన మరో ఓటీపీని కూడా చెప్పాలని అడగడంతో నేను ఎంటర్‌ చేశా. ఈ క్రమంలో నా ఖాతా నుంచి రూ.57,636ల నగదు డెబిట్‌ అయింది’’ అని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, ఆశచూపిస్తూ పంపించే ఇలాంటి లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని ముంబయి సైబర్‌ క్రైం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని