డ్రగ్స్‌ కేసులో హాస్యనటి దంపతుల అరెస్టు

బాలీవుడ్‌లో మరో కుదుపు. మాదకద్రవ్యాల కేసులో ప్రముఖ హాస్యనటి భారతిసింగ్‌, ఆమె భర్త హర్ష్‌ లింబాచియ్యాను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది....

Updated : 22 Nov 2020 13:28 IST

ముంబయి: బాలీవుడ్‌లో మరో కుదుపు. మాదకద్రవ్యాల కేసులో ప్రముఖ హాస్యనటి భారతిసింగ్‌, ఆమె భర్త హర్ష్‌ లింబాచియ్యాను నార్కోటిక్స్‌‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం శనివారం భారతిసింగ్‌ను అరెస్ట్‌ చేసిన ఎన్‌సీబీ.. ఆ తర్వాత ఆదివారం ఉదయం ఆమె భర్తను కూడా అదుపులోకి తీసుకుంది. విచారణలో వారు డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఒప్పుకున్నారని అధికారులు తెలిపారు. ఎన్‌సీబీ అధికారుల వివరాల ప్రకారం.. దర్యాప్తు సంస్థ శనివారం ఉదయం భారతిసింగ్‌, హర్ష్‌ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కాగా వారింట్లో 86.5 గ్రాముల గంజాయి లభించింది. దీంతో అధికారులు భార్యాభర్తలకు సమన్లు జారీ చేశారు. 

ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయంలో శనివారం విచారణకు హాజరైన దంపతులను అధికారులు విడివిడిగా ప్రశ్నించారు.  దాదాపు 15 గంటలపాటు జరిగిన విచారణలో వారిరువురు డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఒప్పుకొన్నారు. ‘భారతిసింగ్‌, ఆమె భర్త హర్ష్‌ లింబాచియ్యా గంజాయి సేవించినట్లు ఒప్పుకొన్నారు. దీంతో దంపతులను ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశాం’ అని ఎన్‌సీబీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. డ్రగ్స్‌ కేసులో గతంలో అరెస్టు చేసిన డ్రగ్స్‌ సరఫరా చేసిన ఓ వ్యక్తిని విచారించగా అతడు భారతిసింగ్‌ పేరును వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు.

నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి అనంతరం బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వినియోగం కలకలం రేపింది. విచారణ చేపట్టిన ఎన్‌సీబీ సుశాంత్‌కు అతడి సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తి డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు నిర్ధారించి ఆమెను అరెస్టు చేసింది. నటితోపాటు ఆమె సోదరుడు, పలువురిని అదుపులోకి తీసుకుంది. మరికొంతమంది ప్రముఖ నటీమణులను విచారించింది. దీపికా పదుకొణే, శ్రద్ధాకపూర్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, సారా అలీఖాన్‌ ఈ జాబితాలో ఉన్నారు. ఇటీవల నటుడు అర్జున్‌రాంపాల్‌, అతడి ప్రియురాలు గాబ్రియేల్ల దెమిత్రియాడెస్‌ను అధికారులు ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని