కూలిన భవనం.. శిథిలాల కింద 70మంది!

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. మహద్‌ ప్రాంతంలో.......

Updated : 25 Aug 2020 08:28 IST

15మందికి గాయాలు

రాయ్‌గఢ్‌: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మహద్‌ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 15మంది గాయపడగా.. దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. మరోవైపు, సహాయక సిబ్బంది 15 మందిని కాపాడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముంబయి నుంచి ఘటనా స్థలానికి బయల్దేరాయి. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కూలిన ఈ భవనంలో 45 ఫ్లాట్లు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలంలో దుమ్ము, ధూళి దట్టంగా అలముకొంది. 

ఈ రోజు సాయంత్రం 6.50 గంటల ప్రాంతంలో మహద్‌లోని మండలం కజాల్‌పురలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిపోయిందని ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారి వెల్లడించారు. శిథిలాల కింద 50మందికి పైగా చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. సహాయ చర్యలకు అవసరమైన సామగ్రితో మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపినట్టు అధికారి తెలిపారు. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. దీనిపై స్థానిక మంత్రి అదితి తట్కరే మాట్లాడుతూ.. స్థానిక సహాయక బృందాలు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిపారు. వీటికి అదనంగా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటాయని తెలిపారు.

 

 

కలెక్టర్‌కు సీఎం ఉద్ధవ్‌ ఫోన్‌!

ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. కలెక్టర్‌ నిధి చౌధురి, స్థానిక ఎమ్మెల్యే భరత్‌ గొగవాలేకు ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై విచారణకు ఆదేశించారు. సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టేలా అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు.

భవనం కూలడం విషాదకరం: అమిత్‌ షా
భవనం కూలిపోయిన ఘటన విషాదకరమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతిఒక్కరూ క్షేమంగా ఉండాలని ట్విటర్‌ వేదికగా ప్రార్థించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని