నటి దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన హిందీ ప్రముఖ హాస్యనటి భారతిసింగ్‌, ఆమె భర్త హర్ష్‌ లింబాచియ్యాకు ముంబయి కోర్టు ఆదివారం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది....

Updated : 22 Nov 2020 16:31 IST

ముంబయి: మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన ప్రముఖ హిందీ హాస్య నటి భారతి సింగ్‌, ఆమె భర్త హర్ష్‌ లింబాచియ్యాకు ముంబయి కోర్టు ఆదివారం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. గంజాయి సేవించినట్లు వారు ఒప్పుకోవడంతో డిసెంబర్‌ 4 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి కోర్టు ఆదేశించింది. డ్రగ్స్‌ కేసులో భారతి సింగ్‌ దంపతులను అరెస్టు చేసిన నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)... అక్కడికి కొద్ది గంటలకే ముంబయి కోర్టులో ప్రవేశపెట్టింది. కేసును పరిశీలించిన కోర్టు వారికి జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఎన్‌సీబీ శనివారం ఉదయం భారతి సింగ్‌, హర్ష్‌ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా వారింట్లో 86.5 గ్రాముల గంజాయి లభించింది. దీంతో భార్యాభర్తలకు అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరైన దంపతులను, అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించగా... డ్రగ్స్‌ తీసుకున్నట్లు వారు ఒప్పుకొన్నారు. దీంతో ఇద్దరినీ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశారు.

అంతకుముందు ఎన్‌సీబీ అధికారులు ముంబయిలోని ఖార్‌ దంగా ప్రాంతంలో సోదాలు నిర్వహించి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న 21 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వివిధ రకాల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారం, ఇతర ఆధారాలతో శనివారం భారతి సింగ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని 15 గంటలపాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు.  

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతితో అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వినియోగం కలకలం సృష్టించింది. విచారణ చేపట్టిన ఎన్‌సీబీ ఆ నటుడికి డ్రగ్స్‌ సరఫరా చేసిన నటి రియా చక్రవర్తిని అరెస్టు చేసింది. మాదకద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉన్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రియా వాట్సాప్‌ ఛాట్‌ ఆధారంగా ఇండస్ట్రీకి చెందిన అనేక మందికి సమన్లు జారీ చేసి, విచారించారు. ఈ వ్యవహారంలో విచారణకు హాజరైన వారిలో ప్రముఖ నటీనటులతోపాటు దర్శకులు, సహాయ దర్శకులు, నిర్మాతలు కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని