
నుదుటిపై తాళంచెవితో పొడిచిన పోలీసులు
ఉత్తరాఖండ్లో ఘటన
రుద్రాపుర్: పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై దుశ్చర్యకు పాల్పడ్డారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడుపుతున్న యువకుడి నుదుటిలో తాళంచెవితో పొడిచారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్లోని రుద్రాపుర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు పోలీసు స్టేషన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జీకి తెగబడ్డారు. ఈ ఘటనపై మండిపడ్డ జిల్లా పోలీసు శాఖ ఓ ఎస్సై, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ దిలీప్సింగ్ కున్వర్ మాట్లాడుతూ.. ‘ఈ ఘటనతో సంబంధమున్న ఓ ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశాం. దీనిపై విచారణకు సైతం ఆదేశించాం’ అని వెల్లడించారు.
రామ్పురా గ్రామ నివాసి దీపక్ (20) మిత్రుడితో కలిసి ద్విచక్రవాహనంలో పెట్రోల్ పోయించుకునేందుకు స్థానిక పెట్రోల్ బంక్కు వెళుతున్నాడు. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు వారి వాహనాన్ని ఆపారు. అయితే వారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఓ పోలీసు వారి బైక్ తాళంచెవిని లాక్కొని దీపక్ నుదిటిపై బలంగా గుచ్చాడు. కాగా నుదుటిపై తాళం చెవితోనే గ్రామానికి వెళ్లిన బాధితుడు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్థులకు వివరించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులుస్థానిక పోలీసు స్టేషన్కు చేరుకొని ఈ దారుణానికి పాల్పడ్డ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తుండగా వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.
సమాచారం అందుకున్న స్థానిక శాసనసభ్యుడు రాజ్కుమార్ తుక్రాల్ పోలీసు స్టేషన్కు చేరుకుని ఈ సంఘటపై అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే స్థానికులను సముదాయించారు. పోలీసులపై రాళ్లు రువ్విన అంశంపై సూపరింటెండెంట్ మాట్లాడుతూ ‘రాళ్లు రువ్విన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. గాయపడ్డ బాధితుడు దీపక్ ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.