ఏడుస్తోందని కూతురిని చంపేశాడు!

కూతురు ఏడుస్తుందని తండ్రి గొంతు కోసి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..వాసుదేవ్‌ గుప్తా అనే వ్యక్తి యూపీలోని సుల్తాన్‌పూర్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. 20 రోజుల కిందట భార్యభర్తల మధ్య గొడవ జరిగి

Updated : 31 Oct 2020 19:18 IST

లఖ్‌నవూ : కూతురు ఏడుస్తుందని గొంతు కోసి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వాసుదేవ్‌ గుప్తా అనే వ్యక్తి యూపీలోని సుల్తాన్‌పూర్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉండేవారు. 20 రోజుల కిందట భార్యభర్తల మధ్య గొడవ జరిగి భార్య మూడేళ్ల బాలుడితో ఇంటి నుంచి వెళ్లిపోయారు.

అప్పటి నుంచి నాలుగేళ్ల చిన్నారి తల్లికోసం ఏడుస్తూనే ఉంది. అసలే భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదనే నిరాశలో ఉన్న అతను బాలిక ఏడుపు ఆపకపోవడంతో విచక్షణ కోల్పోయాడు. గురువారం ఆ చిన్నారిని కత్తితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని టవాల్‌లో చుట్టి తను నడిపే ఆటోలో వేసుకొని భార్య కోసం వెతకడం ప్రారంభించాడు. తన భార్య పని చేసే నోయిడాలోని షాపుతో పాటు ఇతర ప్రాంతాల్లో భార్య ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించాడు. ఎంతకీ భార్య ఆచూకీ దొరకకపోవడంతో కూతురి మృతదేహాన్ని భార్య పనిచేసే దుకాణం బయట  పడేయాలనుకున్నాడు. 

గురువారం సాయంత్రం గుప్తా ఇంటికి వెళ్లిన అతని తమ్ముడు అక్కడ ఎవరూ లేకపోవడం గమనించి అన్నకు ఫోన్‌ చేశాడు. కూతురిని చంపేసి, భార్య కోసం వెతుకుతున్నట్లు తన తమ్ముడికి చెప్పాడు. అతను వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. స్పందించిన పోలీసులు నోయిడాలోని ఓ ప్రాంతంలో హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. కూతురు ఆపకుండా ఏడుస్తున్న కారణంతోనే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనిపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని