రోడ్లు శుభ్రపర్చమని పోలీసుకు షాకిచ్చిన కోర్టు‌!

కర్ణాటకలోని కలబురగి హైకోర్టు ఇటీవల ఓ పోలీసు అధికారికి షాకిచ్చింది. ఓ బాధితురాలి ఫిర్యాదు విషయమై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో బజార్‌ పీఎస్‌ స్టేషన్‌ అధికారి విఫలమైనందున.. ఆయనను వారం రోజుల పాటు రోడ్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. 

Updated : 24 Dec 2020 20:50 IST

బెంగళూరు: కర్ణాటకలోని కలబురగి హైకోర్టు బెంచ్‌ ఇటీవల ఓ పోలీసు అధికారికి షాకిచ్చింది. ఓ బాధితురాలి ఫిర్యాదు విషయమై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో పీఎస్‌ స్టేషన్‌ అధికారి నిర్లక్ష్యం ప్రదర్శించినందున.. ఆయనను వారం రోజుల పాటు రోడ్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. 

వివరాల్లోకి వెళ్తే.. కలబురగి తాలుకా, మినజ్గి తండాకు చెందిన తారాబాయి(55) అనే మహిళ కుమారుడు సురేష్‌ అక్టోబర్‌ 20న అదృశ్యమయ్యాడు. దీంతో ఆమె తన కుమారుడి జాడ వెతికి పెట్టాలంటూ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం కొద్ది రోజులకు తన కుమారుడిని వెతికిపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ  ఆమె హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సురేష్‌ను నవంబర్‌ 3న వెతికి పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. 

ఈ క్రమంలో జస్టిస్‌ ఎస్‌ సునీల్‌దత్త యాదవ్‌, జస్టిస్‌ పీ రామకృష్ణ భట్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును మరోసారి పూర్తిగా పరిశీలించింది. బాధితురాలు ఫిర్యాదు చేసినపుడు ఆమె ఫిర్యాదుపై పోలీసులు తొలుత కనీసం స్టేషన్‌ డైరీలో గానీ, ఎఫ్‌ఐఆర్‌ నమోదు గానీ చేయకపోవడంపై సీరియస్‌గా పరిగణించింది. ఈ క్రమంలోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో విఫలమైన స్టేషన్‌ హౌజ్‌ అధికారిని వారం రోజుల పాటు పోలీసుస్టేషన్‌ ముందు రోడ్లు శుభ్రపరచవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పోలీస్‌స్టేషన్లలో ఇలాంటి చర్యల విషయంలో కాస్త దృష్టి సారించాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేసింది. అదేవిధంగా జీరో ఎఫ్‌ఐఆర్‌ అంశంపై జిల్లా పోలీసు అధికారులకు వర్క్‌షాప్‌ నిర్వహించాలని ఎస్పీకి సూచనలు చేసింది. 

ఈ క్రమంలో కోర్టు ఆదేశాలపై ఎస్‌హెచ్‌వో స్పందిస్తూ.. ‘కోర్టు ఆదేశానుసారం.. స్టేషన్‌ ముందు రోడ్లు శుభ్రపరచడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మరోసారి ఈ విధంగా వ్యవహరించనని కోర్టుకు విన్నవిస్తున్నా’ అని తెలిపారు. 

ఇదీ చదవండి

తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని