బంజారాహిల్స్‌లో భారీగా నగదు స్వాధీనం

నగరంలోని బంజారాహిల్స్‌లో భారీగా తరలిస్తున్న నగదును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 15 Sep 2020 22:17 IST

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో భారీగా తరలిస్తున్న నగదును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. రెండు కార్లలో వెళ్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3.75కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయి కేంద్రంగా నిర్వహించే ఓ సంస్థకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్ నంబర్‌ 12లో శాఖ ఉంది. ఆ శాఖకు గిరి, రాఠోడ్ అనే వ్యక్తులు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. ముంబయిలోని అదే కంపెనీ ప్రధాన శాఖలో పని చేసే దిలీప్, హరీష్ హైదరాబాద్‌ వచ్చారు. ఈ నలుగురూ కారులో డబ్బును తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు ఆ వాహనాన్ని ఆపారు. కారులో తనిఖీ చేయగా నగదు బయటపడింది. నగదుకు సంబంధించి లెక్కలు చూపించకపోవడంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని