
వైద్య సిబ్బంది చేతిలోంచి జారిపడి శిశువు మృతి
వనస్థలిపురం ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
వనస్థలిపురం: కాన్పు చేస్తున్న సమయంలో వైద్య సిబ్బంది చేతిలోనుంచి అప్పుడే పుట్టిన శిశువు జారి పడి మృతి చెందింది. ఈ దుర్ఘటన వనస్థలిపురం ప్రాంతీయ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీర్పేటకు చెందిన గర్భిణి(23) శుక్రవారం రాత్రి కాన్పు కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. సోమవారం తెల్లవారుజామున ఆరు గంటలకు మగశిశువుకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో శిశువు ప్రమాదవశాత్తు సిబ్బంది చేతిలోనుంచి జారి కింద పడటంతో తలకు గాయమైంది. వెంటనే శిశువును చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు శిశువు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించాడని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.