
వెయ్యికోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టివేత!
191కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న ముంబయి అధికారులు
ముంబయి: ముంబయిలో పెద్తఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నవీ ముంబయిలోని పోర్టులో 191 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముంబయిలో ఈ స్థాయిలో పట్టుబడటం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. వీటిని సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను ముంబయి డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ మాదకద్రవ్యాలను ఆఫ్ఘనిస్థాన్ నుంచి ముంబయికి తీసుకొచ్చినట్లు గుర్తించారు. ప్లాస్టిక్ పైపుల లోపల అమర్చిన ఈ మాదక ద్రవ్యాలను ఇరాన్ మీదుగా ఇక్కడకు తరలించినట్లు తెలిపారు. అయితే, పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు వెదురుబొంగులు వలే కనిపించే విధంగా ప్లాస్టిక్ పైపులకు రంగులను పూసినట్లు అధికారులు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు కస్టమ్స్ అధికారులతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించి వీటిని పట్టుకున్నారు. ఈ మాదక ద్రవ్యాలను ముంబయి నుంచి దేశంలోని ప్రముఖ నగరాలకు చేరవేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు గుర్తించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగమైన మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
గతకొన్ని సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచంలోనే మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారింది. యూరప్తోపాటు భారత్ వంటి దేశాలకు రోడ్డు, సముద్రమార్గాల ద్వారా గుట్టుగా ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. ఈ మధ్యే పంజాబ్లోనూ భారీ స్థాయిలో హెరాయిన్ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.