చిన్నతల్లికి ఎంత కష్టం.. అత్యాచారానికి గురై వీధిలో రక్తమోడుతూ సాయం కోరితే..!

Crime News: అత్యాచారానికి(Rape) గురై, తీవ్రంగా గాయపడిన బాలిక సాయం కోరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. అర్ధనగ్నంగా రోడ్డుపై తిరుగుతున్న ఆమెను ఆదుకోలేదు. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో చోటుచేసుకుంది. 

Published : 27 Sep 2023 12:05 IST

భోపాల్‌: మనముందు చిన్నపిల్లలు కిందపడితే అయ్యో..! అంటూ పరిగెత్తి లేపెస్తుంటాం. అలాంటిది నడిరోడ్డుపై అర్ధనగ్నంగా రక్తమోడుతూ ఇంటింటికెళ్లి తలుపు తడుతూ సాయం కోరిన ఓ చిన్నారిని ఆదుకునే మాట అటుంచి.. చీదరించుకున్నారు. ఇంకా లోకం తెలియని ఆ 12 ఏళ్ల బాలికకు కామాంధుడు చేసిన గాయం ఒంటిని బాధిస్తుంటే.. ఈ ఛీత్కారాలు బాకుల్లా దిగాయి..! మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో వెలుగులోకి వచ్చిన దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. (Crime News)

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాద్‌నగర్ రోడ్డులో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో కనిపించిన దృశ్యాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోలో సుమారు 12 ఏళ్ల వయసున్న బాలిక అర్ధ నగ్నంగా నడిరోడ్డుపై తిరుగుతూ ప్రతి ఇంటి తలుపు తడుతూ కనిపించింది . అప్పటికే ఆమె వ్యక్తిగత అవయవాల నుంచి రక్తం కారుతూ ఉంది. అత్యాచారానికి గురికావడం వల్లే ఆమెకు ఆ దుస్థితి తలెత్తింది.

బాలుడి సజీవ దహనం కేసులోని నిందితుడి సంబరాలు

ఆమెను చూసి దిగ్బ్రాంతికి గురైనా.. ఎవరూ సాయం చేయడానికి మాత్రం ముందుకు రాలేదు. ఆమె ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. చీదరించుకొని పక్కకు వెళ్లిపొమ్మని సైగలు చేయడం కనిపించింది. దిక్కుతోచని ఆమె అలాగే నడుచుకుంటూ ఓ ఆశ్రమం ప్రాంగణంలోకి వెళ్లింది. అక్కడి నిర్వాహకులు అత్యాచారం జరిగిందని అనుమానించి, ఆమె ఒంటిపై టవల్‌ కప్పి స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు..ఆమెపై అత్యాచారం జరిగిందని ధ్రువీకరించారు.

గాయాలు తీవ్రంగా ఉండటంతో ఆ బాలికను ఇండోర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రక్తస్రావం ఎక్కువగా ఉండటంతో.. అక్కడున్న పోలీసులు రక్తదానానికి ముందుకువచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ‘వైద్యపరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారణ అయింది. నిందితుల్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించేందుకు మేం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. ఎవరికైనా ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిస్తే.. తెలియజేయాలని కోరుతున్నాం’ అని ఉజ్జయిని పోలీస్‌ చీఫ్ సచిన్‌ శర్మ తెలిపారు. ‘బాధితురాలు తన పేరు, చిరునామా వంటి వివరాలు స్పష్టంగా  చెప్పలేకపోతోంది. ఆమె మాట్లాడుతున్న యాస ప్రకారం.. ఆమెది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ అని భావిస్తున్నాం’ అని తెలిపారు. 

2019 నుంచి 2021 మధ్యకాలంలో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో మహిళలు, బాలికల అదృశ్యాలు నమోదైనట్లు నేషనల్‌ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది. 2021లో మధ్యప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో అత్యాచార కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని