Crime News: 14 ఏళ్ల బాలుడితో వివాహిత పరారీ.. హైదరాబాద్‌లో సహజీవనం

సభ్య సమాజం తలదించుకునే ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. గుడివాడ టూ టౌన్‌ సీఐ వి.దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం .. గుడివాడ పట్టణంలో నివాసముండే వివాహిత మహిళ (31) స్థానికంగా ఉండే చిన్నారులతో నిత్యం సెల్‌ఫోన్‌లో హౌసీ గేమ్‌ ఆడుతూ వారిని...

Updated : 27 Jul 2022 18:28 IST

గుడివాడ రూరల్‌: సభ్య సమాజం తలదించుకునే ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. గుడివాడ టూ టౌన్‌ సీఐ వి.దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం .. గుడివాడ పట్టణంలో నివాసముండే వివాహిత మహిళ (31) స్థానికంగా ఉండే చిన్నారులతో నిత్యం సెల్‌ఫోన్‌లో హౌసీ గేమ్‌ ఆడుతూ వారిని ఆకర్షిస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమె ఎదురింట్లో నివాసముండే బాలుడు(14) వివాహిత పట్ల ఆకర్షితుడయ్యాడు. వీరి మధ్య చనువు పెరగడంతో బాలుడిని ఆమె శారీరకంగా లోబర్చుకుంది. స్థానిక ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న బాలుడు వివాహిత కారణంగా సరిగా పాఠశాలకు కూడా వెళ్లే వాడు కాదు. ఆమె ఇంటికి బాలుడు తరచూ వెళ్లడాన్ని గమనించి బాలుడి తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. ఈ విషయం బాలుడు ఆమెతో చెప్పాడు. దీంతో బాలుడు తనకు దూరమవుతాడని భావించిన మహిళ అతనికి మాయమాటలు చెప్పి ఈనెల 19న బలవంతంగా హైదరాబాద్ తీసుకెళ్లింది. వివాహితకు ప్రస్తుతం నలుగురు సంతానం ఉండగా.. భర్త.. పిల్లలను వదిలేసి బాలుడిని తీసుకొని వెళ్లి పోయింది. హైదరాబాద్‌ బాలానగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బాలుడితో సహజీవనం చేస్తోంది.

కొన్ని రోజులు గడిచిన తర్వాత బాలుడు గుడివాడలోని తన ఇంటికి వెళ్లాలని భావించాడు. తన వద్ద డబ్బులు లేవని.. స్పందించి డబ్బులు పంపాలని స్నేహితులు, చుట్టు పక్కల వారికి ఫోన్‌లో మెస్సేజ్‌ పెట్టాడు. ఎవరూ స్పందించకపోవడంతో తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తాను హైదరాబాద్‌లో ఉన్నానని, ఇంటికి వస్తానని చెప్పాడు. అప్పటికే జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు గుడివాడ టూటౌన్‌ స్టేషన్‌ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు ఏపీలోని వివిధ జిల్లాల్లో బాలుడి కోసం గాలింపు చేపట్టాయి. ఓ బృందం బాలుడు మాట్లాడుతున్న సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా గుర్తించి వారున్న ఇంటికి వెళ్లారు. మంగళవారం రాత్రి బాలానగర్‌లో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని బుధవారం ఉదయం గుడివాడ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వివాహితపై కిడ్నాప్‌, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని